వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) లిక్కర్ స్కాం కేసును తప్పుదారి పట్టించే కుట్రగా అభివర్ణించారు. అసలు స్కాం ఏమీ లేదని, ఇది పూర్తిగా బోగస్ అని ఆరోపించారు. ప్రజల సమస్యలపై దృష్టిని మళ్లించేందుకు ఈ కుట్రను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మిథున్ అరెస్టు అక్రమం – చంద్రబాబు పై ఉన్న కేసులపై ప్రశ్న
“మూడు సార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు” అంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ స్కాంలో 2014-19 కాలంలో రూపొందించిన లిక్కర్ పాలసీపై కేసులు నమోదు అయ్యాయని, ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడే ఈరోజు బెయిల్ పై బయట ఉన్నారని గుర్తుచేశారు. ఇలా నిజమైన బాధ్యులను వదిలేసి, నిర్దోషులపై వేధింపులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ పాలనలో అవినీతి – మళ్లీ తెరుస్తున్న బెల్ట్ షాపులు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ బెల్ట్ షాపులు తెరుస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ హయాంలో మూసివేసిన అనధికార మద్యం దుకాణాలు తిరిగి తెరవడమే కాకుండా, లిక్కర్ షాపుల లైసెన్సుల కేటాయింపులో, డిస్టిలరీలకు ఇచ్చిన ఆర్డర్లలో భారీగా అవినీతి జరుగుతోందని విమర్శించారు. ప్రజల అభ్యున్నతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
Read Also : Karnataka : భర్తను నదిలోకి తోసేసిన భార్య?..అసలు ట్విస్ట్ ఇదే