హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం (Rain) తన ప్రతాపాన్ని చూపుతోంది. కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మైండ్ స్పేస్, ఐకియా, మాదాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. వర్షం వలన రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజ్ వ్యవస్థలు విఫలమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రికి ఇంకా అధిక వర్ష సూచన
ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ (Department of Meteorology) మరో హెచ్చరిక జారీ చేసింది. రాత్రి వేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది. ప్రజలు అత్యవసర పనులు తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది. నీటిలో చిక్కుకుపోయే ప్రాంతాలకు ముందస్తుగా అజాగ్రత్త ఉండాలని, అధికారులు వాహనదారులకు సూచిస్తున్నారు.
వాహనదారులకు నరకయాతన, ప్రధాన రహదారులపై భారీ రద్దీ
వర్షంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. జూబ్లీ చెక్పోస్ట్, PVNR ఎక్స్ప్రెస్వే, జేబీఎస్, తిరుమలగిరి, లక్షీకపూల్ వంటి ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలతో వాహనాలని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాతనగరంలో నివసించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also : Rain : GHMC ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్