తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఈరోజు (జూలై 18) నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన కొల్లాపూర్ మండలంలోని జటప్రోలు గ్రామాన్ని సందర్శించనున్నారు. అక్కడ ఉన్న ప్రసిద్ధ మదనగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన
జటప్రోలులో ఏర్పాటు చేయనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ (Young India Integrated Residential School)కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ స్కూల్ ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆధునిక విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
మహిళలకు చెక్కుల పంపిణీ
బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాయంగా చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్థిరత్వం, స్వావలంబనకు మద్దతుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రేవంత్ ప్రసంగంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రకటనలు ఉండే అవకాశం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
Read Also : Hyderabad Airport : విమానాశ్రయాన్ని భయపెడుతున్న పక్షి తాకిడి