తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల (Local Elections) కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల పరిషత్ (ZPTC) మరియు మండల పరిషత్ (MPTC) స్థానాలను ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ZPTC స్థానాల సంఖ్య 566గా, MPTC స్థానాల సంఖ్య 5,773గా ఖరారు అయింది. ఇంతకు ముందు ఉన్న 5,817 MPTC స్థానాలు కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడం వల్ల తగ్గినట్టు స్పష్టమైంది. ఈ మార్పులు ముఖ్యంగా ఇంద్రేశం, జిన్నారం వంటి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో చోటు చేసుకున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ – గవర్నర్ ఆమోదానికి ఎదురుచూపు
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సర్పంచ్, MPTC, MPP, ZPTC, మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానాలకు 42% రిజర్వేషన్ అందించాలన్న తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ పెంపు కోసం ఒక ఆర్డినెన్స్ను సిద్ధం చేసి గవర్నర్కు పంపించారు. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఇది అధికారికంగా అమలులోకి వస్తుంది. దీనివల్ల బీసీల రాజకీయ భాగస్వామ్యం మరింతగా బలోపేతం కానుంది.
ఎన్నికల ప్రక్రియకు వేగం – రాజ్యాంగం ప్రకారం స్ధానిక పరిపాలన బలోపేతం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించింది. 2019లో చివరిసారిగా మూడు దశల్లో MPTC మరియు ZPTC ఎన్నికలు నిర్వహించగా, ఈసారి కొత్త మున్సిపాలిటీలు ఏర్పడటం వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. భారత రాజ్యాంగంలోని 73, 74వ సవరణల ప్రకారం, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను ప్రజలే ఎన్నుకునే విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ పని చేస్తుంది. ZPTC మరియు MPTC సభ్యులు ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. వారు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో ముఖ్య భూమిక పోషిస్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనను బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.
Read Also : TGBKS ఇన్ఛార్జ్ గా కొప్పుల ఈశ్వర్