తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర జలశక్తి మంత్రితో జరిగిన భేటీలో బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించలేదు అనే విషయం తేటతెల్లమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక “గురుదక్షిణ” కోణంలో జరుగుతోందంటూ ఆయన ఎద్దేవా చేశారు.
గోదావరి జలాలపై బుకాయింపు?
గోదావరి జలాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన కేటీఆర్ – రేవంత్ నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సిందని అన్నారు. గోదావరి నీటిని గుదిబండల మీద అప్పగించడమే రేవంత్ లక్ష్యమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది త్యాగాలు చేశారు, ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నవాడు వారి ఆశయాలను తాకట్టు పెట్టకూడదని హితవు చెప్పారు.
కేటీఆర్ హెచ్చరిక
ప్రాంతీయ హక్కుల పరిరక్షణ విషయంలో కేటీఆర్ గంభీరంగా స్పందించారు. “ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొడతాం, కానీ ప్రాంత వాడు మోసం చేస్తే ఇక్కడే పాతిపెడతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిని మోసం చేయడం తగదన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు-రేవంత్ భేటీ అనంతరం తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
Read Also ; Maruti Suzuki : మారుతి సుజుకి కార్ల ధరలు పెరిగాయ్