హైదరాబాద్ నగరంలో సరిపడా వర్షాలు(Rains) కురవకపోవడం, భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో నీటి ట్యాంకర్లపై డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలై 1 నుంచి 14వ తేదీ వరకు ట్యాంకర్ల బుకింగ్లు 36 శాతం పెరిగాయని జలమండలి వెల్లడించింది. దీంతో నగరంలో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల డిమాండ్ పెరగడం వల్ల నగరానికి నీటి సరఫరా చేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఇంకుడు గుంతలు లేకుంటే ట్యాంకర్ల ధరలు పెంపు
ఈ పరిస్థితుల నేపథ్యంలో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. 300 గజాల విస్తీర్ణం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించి ఇంకుడు గుంత లేకుండా నీటి ట్యాంకర్లను బుక్ చేసుకున్నవారికి ట్యాంకర్ల ధరలు పెంచుతామని హెచ్చరికలు జారీ చేసింది. భూగర్భ జలాలను పునరుత్తేజింపజేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెరగడంతో పాటు, వర్షపు నీటిని భూమిలోకి చొప్పించి భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ఇంకుడు గుంతల ద్వారా నీటి భద్రతకు దోహదం
ఇంకుడు గుంతలు వర్షపు నీటిని భూమిలోకి చొప్పించి, భూగర్భ జల మట్టాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్ల సహజంగా నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గిపోయాయి. ఫలితంగా వర్షపు నీరు వృథాగా వెళ్లి మురుగు నీటిగా మారుతోంది. ఇంకుడు గుంతలు ఈ పరిస్థితిని తగ్గిస్తూ, పర్యావరణ పరిరక్షణకు, నీటి భద్రతకు తోడ్పడతాయి. జలమండలి తీసుకున్న ఈ నిర్ణయం వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టు వృథా కాకుండా సద్వినియోగం అయ్యేలా చేస్తుందని అధికారులు స్పష్టంచేశారు.
Read Also ; Chandrababu : ముగిసిన అమిత్ షా, చంద్రబాబు మీటింగ్