తెలంగాణ రాష్ట్రంలో విద్యావృద్ధి దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలను (Govt Schools) ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కనీసం 20 మంది విద్యార్థుల సంఖ్య ఉన్న ప్రదేశాల్లో కొత్త బడులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా స్కూళ్ల ఏర్పాటు
మొత్తంగా 571 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం (Telangana Govt) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశగా వెంటనే 157 స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించగా, అందులో గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 పాఠశాలలు ఉన్నాయి. సంబంధిత జిల్లా విద్యా అధికారి (DEO)లకు వీటిని త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
వసతుల కల్పనకు తగిన బడ్జెట్
కొత్తగా ప్రారంభించే ఈ సర్కారీ పాఠశాలలకు అవసరమైన ఫర్నీచర్, బోర్డులు, పాఠ్య పుస్తకాలు, విద్యా సామగ్రి తదితర అంశాల కోసం అవసరమైన బడ్జెట్ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనున్నారు. విద్యారంగ అభివృద్ధికి ఇది కీలకమైన ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. అందరికి విద్యా హక్కు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Also : NTR Baby Kits : త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’