డాబర్ చ్యవన్ప్రాశ్ను లక్ష్యంగా చేసుకొని పతంజలి (Patanjali) ఆయుర్వేద్ జారీ చేసిన ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని దిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ మణి పుష్కర్ణ ఆదేశాలిచ్చారు. అంతకుముందు.. తమ ప్రముఖ ఉత్పత్తులను అవమానిస్తూ పతంజలి వాణిజ్య ప్రకటనలు జారీ చేస్తోందని డాబర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు.
వివాదానికి కారణమైన ప్రకటనలు
ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినట్లు కేవలం తాము మాత్రమే చ్యవన్ప్రాశ్ను (Chyawanprash) తయారుచేస్తామని పతంజలి (Patanjali) తమ ప్రకటనలో చెబుతోంది. అంతేకాదు.. ఇతర సంస్థలు సరైన పరిజ్ఞానంతో ఉత్పత్తులు చేయడం లేదని వెల్లడించింది. దీంతో డాబర్ దిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించింది. ఈ వాణిజ్య

ప్రకటనలను నిలిపివేయడంతోపాటు.. తమ పేరుకు భంగం కలిగించినందుకు రూ.2 కోట్ల మేరకు నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. తమ ఉత్పత్తే సరైందని పతంజలి వాణిజ్య ప్రకటనల్లో తప్పుగా క్లెయిమ్ చేస్తోందని ఆరోపించింది. ఈ అంశంపై న్యాయస్థానం జులై 14న తదుపరి విచారణను చేపట్టనుంది.
పతంజలి పై గతంలోనూ న్యాయస్థానాల నిఘా
గతంలో కరోనా వైద్యం విషయంలో పతంజలి (Patanjali) తప్పుడు ప్రచారం చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ సంస్థపై చర్యలు తీసుకొన్న విషయం తెలిసిందే. నాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆ సంస్థపై న్యాయపోరాటం చేసింది.ఇటీవలి కేసులోనూ పతంజలి ప్రకటనల బాష, పదజాలంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.