తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ (Ration Card holders) మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం నేటితో ముగియనుంది. జూన్, జులై, ఆగస్టు నెలల రేషన్ను ముందుగానే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలోనే ఈ మూడుమాసాల బియ్యం పంపిణీ చేపట్టింది. అయితే ఇప్పటి వరకు రేషన్ తీసుకోని లబ్ధిదారులు, ఇవాళే (జూన్ 30) లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తదుపరి బియ్యం పంపిణీ సెప్టెంబరులోనే జరుగుతుంది.
వర్షాకాలం – కొండ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రం నిర్ణయం
వర్షాకాలం కారణంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోని ప్రజలు రేషన్ కోసం తరచూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ముందుగానే మూడు నెలల రేషన్ ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి, ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున మొత్తం 18 కిలోల బియ్యాన్ని అందజేస్తోంది. ఇది గ్రామీణ, లంబడీ, గిరిజన ప్రాంత ప్రజలకు చాలా ఊరట కలిగించింది.
రాష్ట్రంలో సన్న బియ్యం, దేశంలో దొడ్డు బియ్యం
దేశవ్యాప్తంగా కేంద్రం పంపిణీ చేసే బియ్యం దొడ్డు బియ్యంగా ఉంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం సన్న బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యం నాణ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కొని లబ్ధిదారులకు సరఫరా చేస్తోంది. ఇది ప్రజల్లో మంచి స్పందనను రేకెత్తించగా, తీసుకోని వారు తక్షణమే తమ రేషన్ తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుబాటులో ఉన్న సుదీర్ఘ సమయాన్ని వినియోగించుకుని రేషన్ తీసుకోకపోతే, ఇంకో రెండు నెలలు వేచిచూడాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
Read Also : Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద