రైతు భరోసాపై రేవంత్ రెడ్డి, హరీశ్రావుల మధ్య మాటల యుద్ధం
రైతు భరోసా కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. గోదావరి-బనకచర్ల (Godavari-banakacharla) ప్రాజెక్టుపై ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని, తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపిస్తానని ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరారు. ఈ సవాల్తో పాటు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు పలు తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ కార్యక్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి సంస్కారం లేని విధంగా మాట్లాడి తన ‘చిల్లర బుద్ధిని’ మరోసారి ప్రదర్శించారని హరీశ్రావు (Harish Rao) ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపడం ద్వారా రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై భరోసా లేకపోవడంతోనే విధిలేని పరిస్థితుల్లో రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని హరీశ్రావు పేర్కొన్నారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం ప్రపంచం నవ్విపోతోందని ఆయన ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు, డిమాండ్లు
మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయలేని వారు ఇప్పుడు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా కూలాయని అంటున్నారని, ఇది ‘నోరా మోరా’ అని హరీశ్రావు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. దమ్ముంటే, ఇసుమంతైనా నిజాయితీ ఉంటే 30 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సన్న వడ్లకు రూ.1,200 కోట్ల బోనస్ బకాయిలను రైతుల ఖాతాల్లో తక్షణమే వేయాలని కోరారు. తమను హామీలపై ప్రశ్నిస్తున్నందుకే బూతులతో చెలరేగుతున్నారని, అయినా తాము సంయమనం కోల్పోబోమని హరీశ్రావు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు అబద్ధాల పుట్టను బద్దలు కొడుతూనే ఉంటామని హెచ్చరించారు.
రాజకీయ ఆరోపణలు, సవాళ్లు
చివరగా, “గెలిచిన వాడు రాజు, ఓడిపోయిన వాడు రావణాసురుడు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ఈ సూత్రాన్ని అన్వయించుకుంటే, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా అని నిలదీశారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై బహిరంగ చర్చ జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read also: Ramakrishna Rao: కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు