ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(Indigo)లో పనిచేస్తున్న ఒక ట్రైనీ పైలట్ను సహోద్యోగులు కులం పేరుతో దూషించి, తీవ్రంగా అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అశోక్ కుమార్ (Ashok Kumar) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు.
‘‘చమార్’’, ‘‘భంగీ’’ వంటి పదజాలంతో..
ఇండిగో ఎయిర్లైన్స్లో ట్రైనీ పైలట్గా పనిచేస్తున్న అశోక్ కుమార్(Ashok Kumar)ను ఆయన సహోద్యోగులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్ కులం పేరుతో దూషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను ‘చమార్’, ‘భంగీ’ వంటి నిమ్న పదజాలంతో దూషించారని, ‘నువ్వు విమానం నడపడానికి అనర్హుడివి, కాక్పిట్లో కూర్చోవడానికి కూడా నీకు అర్హత లేదు’ అని అవమానించారని అశోక్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కులవృత్తిని గుర్తుచేస్తూ కించపరచడం
అంతటితో ఆగకుండా ‘వెళ్లి చెప్పులు కుట్టుకోపో, నీ కులవృత్తి అదే కదా’ అంటూ తనను తీవ్రంగా అవమానించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికిరావు’ అంటూ ఇతరుల ముందే తనను కించపరిచారని కుమార్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు తనను మానసికంగా తీవ్రంగా గాయపరిచాయని ఆయన వాపోయారు.
కేసు నమోదు – ఎస్సీ, ఎస్టీ చట్టం కింద
అశోక్ కుమార్ (Ashok Kumar) ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్లపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ సంఘటన విమానయాన రంగంలో కుల వివక్ష ఉందనడానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విమానయాన రంగంలో కుల వివక్ష పై తీవ్ర చర్చ
ఈ సంఘటనతో విమానయాన రంగంలో కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందనే అంశం బహిర్గతమైంది.
సామాజిక కార్యకర్తలు, డాలిట్ హక్కుల ఉద్యమకారులు, ఇండిగో మేనేజ్మెంట్పై కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ఒక పైలట్ ఎలా బాధ్యతలు నిర్వహించగలడు? అన్నది ప్రశ్నగా మారింది.
బాధితుడికి న్యాయం, నిందితులకు శిక్ష కావాలన్న డిమాండ్
అశోక్ కుమార్(Ashok Kumar)కు న్యాయం చేకూరాలి, దోషులకు శిక్ష పడాలి అనే డిమాండ్ నెట్టింట్లో జోరుగా వినిపిస్తోంది. సంఘటనపై ఇండిగో ఎయిర్లైన్స్ ఇంకా అధికారికంగా స్పందించకపోయినా, ఈ వివాదం సంస్థపై తీవ్ర ఒత్తిడిని తెచ్చిపెట్టింది.
Read Also: Modi: భారత రైతులకు నష్టం కలిగించలేం..అమెరికాకు చెప్పిన మోదీ