సమాజంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతి అంశంలోను అవినీతి (corruption) ముడిపడి ఉంటోంది. ప్రపంచ యుద్ధం వల్ల కలిగే నష్టం కంటే అవినీతి వల్ల జరుగుతున్న కీడు ప్రభావం ఎక్కువగా ఉంటుందని న్యాయస్థానాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అవినీతికి పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాలు పేర్కొంటున్నాయి.
అయితే అందుకు అనువైన చట్టాలు లేకపోవడంతో అవినీతిపరులు సునాయసంగా కేసులు నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రభుత్వ శాఖల కంటే రాజకీయాల్లో అవినీతి (corruption) ఎక్కువగా ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ జీవితం గడుపుతున్న అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి కేవలం నాలుగైదు సంవత్సరాల్లోనే కోట్లకు పడగెత్తిన దాఖలాలు అనేకం ఉన్నాయి.
అవినీతికి పాల్పడే అధికారులకు, వారికి సహకరించే వ్యక్తులకు కూడా చట్టంలో నేరస్తులుగా గుర్తించాలని స్పష్టంగా ఉంది. గతంలో ఎసిబీ, సిబిఐ అధికారులు అవినీతి అధికారులను పట్టుకున్న సందర్భంలో కేవలం కేసులు మాత్రమే పెట్టేవారు. అయితే సుమారు 12 ఏళ్ల క్రితం చట్టంలో సవరణలు చేసి అవినీతి సొమ్ముతో దొరికిన అధికారిని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు.
ఈ విధానం వల్ల అవినీతి అధికారులు కొంత భయం కలిగింది. అయితే అరెస్ట్ కావడం వెంటనే బెయిల్పై బయటకు రావడం జరిగిపోతోంది. అంతేకాకుండా ఈ కేసులు కోర్టులో నెగ్గకపోవడంతో అవినీతి అధికారులు తిరిగి విధుల్లో చేరుతున్నారు.

అవినీతి అధికారులపై కేసులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి – ఏదైనా పనిచేసేందుకు ఎదుటి వ్యక్తి నుంచి కొంత సొమ్ము ఆశించి అది తీసుకుంటున్న సమయంలో ఎసిబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. రెండోది – ఏదైనా అధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం అందితే అతని ఇంటిపైనా, బంధువుల ఇళ్లలో సోదాలు చేసి ఆస్తుల వివరాలు లెక్కిస్తారు.
నెలసరి తీసుకునే జీతంతో ఈ ఆస్తులను పోల్చి చూస్తారు. ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువగా ఉంటే కేసులు పెడతారు.ఈ రెండు కేసుల్లో మొదట్లో విస్తృత ప్రచారం ఉంటుంది. అయితే కేసు కోర్టుకు వెళ్లిన తరువాత ఈ విషయం గురించి మీడియా పట్టించుకోవడం మానేస్తుంది.
అదేవిధంగా చాలా మంది ఎసిబీ అధికారులు కోర్టులో కేసు దాఖలు అయిన తరువాత సాక్ష్యాలను ప్రవేశపెట్టడంపై అంతగా ఆసక్తి చూపించరు.ఈ విషయంలో అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వత్తిడి రావడం, ఎసిబీకి చెందిన కొందరు సిబ్బంది అభియోగం మోపిన అధికారితో కుమ్మక్కుకావడం, సిబ్బంది కొరత కారణంగా కోర్టు కేసును ఫాలో కాలేకపోవడం.
కోర్టుల్లో కూడా ఎక్కువ కేసులు ఉండటంతో విచారణ సంవత్సరాల తరబడి కొనసాగుతుంది.సర్వీసు రూల్స్ ప్రకారం అంతకాలం పాటు అధికారులను సస్పెంట్లో పెట్టే అవకాశం ఉండదు. దీనితో వారు తిరిగి విధుల్లో చేరి మళ్లీ తమ వ్యవహారాలు కొనసాగిస్తారు.
చాలా సందర్భాల్లో అధికారి అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసి లంచం మొత్తం ఇస్తూ పట్టించిన బాధితులు ఆ తరువాత పోలీసులకు సహకరించరు.వారి కోపం చల్లారిపోవడమో, లేకపోతే అరెస్ట్ చేయించాం ఇక చాలు అన్న భావన వారిలో రావడం జరుగుతుంది.
మరోపక్క వారు దైనందిన జీవితాల్లో బిజీ కావడంతో కోర్టుకు హాజరుకాకపోవడంతో కేసులు కొట్టేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.విచిత్రం ఏమిటంటే అవినీతి కేసులు కోర్టులో 95 శాతం వరకు వీగిపోతుంటాయి. శిక్షలు పడే కేసులు చాలా తక్కువగా ఉంటాయి.
అదేవిధంగా పోలీసు శాఖలో పనిచేసే వారినే ఎసిబీ విభాగానికి తీసుకుంటూ ఉంటారు.గతంలో ఈ విభాగానికి సిబ్బందిని నియమించే సమయంలో అనేక అంశాలను పరిశీలించే వారు. ప్రస్తుతం ఎలాంటి పరిశీలన లేకుండా ఎసిబీ సిబ్బంది నియామకం జరుగుతోంది.
ఈ విభాగానికి వచ్చాక కొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతూ సస్పెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఎసిబీ లో విధులు నిర్వహించడం పట్ల ఆసక్తి ఉండదు. లా అండ్ ఆర్డర్ విభాగానికి వెళ్లిపోవడానికి శ్రద్ధ చూపిస్తారు.దీనితో వీరు ఇక్కడ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపించరు.
కేసులు కోర్టులో ఉన్న సమయంలో వీరు బదిలీ కావడంతో వాటిని పట్టించుకునే వారు ఉండరు.కేసులు ఎక్కువ కాలం కోర్టులో విచారణ కొనసాగడంతో అవినీతి అధికారులు తప్పించుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి.
అవినీతిని (corruption) అంతమొందించాలంటే ప్రస్తుతం ఉన్న చట్టాలు ఏమాత్రం సరిపోవడం లేదు.కీసర మండలంలో ఒక అధికారి ఏకంగా కోటీ 10 లక్షల రూపాయలు తీసుకుంటూ పట్టుపడ్డారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ కోటీ 20 లక్షలు రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు.
మరో మహిళా అధికారి అవినీతి కేసులో అరెస్ట్ కావడంతో మనస్తాపం చెందిన ఆమె భర్త, యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. జైలు నుంచి బెయిల్పై వచ్చి భర్త అంత్యక్రియల్లో పాల్గొన్న మహిళా అధికారిణి కూడా ఆ తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హయాత్ నగర్ లో ఒక మహిళా తహసిల్దారు బాధితుడు ఆఫీసులోనే పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో తహసిల్దార్, బాధితుడితో పాటు అక్కడున్న డ్రైవర్ కూడా మృతి చెందడం సంచలనం కలిగించింది.ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైలు కదలాలంటే లంచం ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది.
ఇలాంటి పరిస్థితులను నిర్మూలించేందుకు సరైన అధ్యయనం జరగడం లేదు. చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. వ్యవస్థలో, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అవినీతికి మార్గం చూపించే లోపాలను సరిదిద్దాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.
Read also: సంక్షోభంలో సినిమా థియేటర్లు