ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని విశాఖపట్నం నగరం ఈ నెల 21వ తేదీన చారిత్రాత్మక ‘యోగాంధ్ర’ (Yoga Andhra) కార్యక్రమానికి వేదిక కానుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రికార్డు స్థాయిలో 5 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొననున్న ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరియు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు.
చంద్రబాబు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:
“ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. రండి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.
లోకేశ్ సందేశం:
“యోగా వ్యాయామం మాత్రమే కాదు, అది ఒక జీవన మార్గం. మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్నారు. రికార్డు స్థాయిలో నిర్వహించే ఈ వేడుకను విజయవంతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. యోగా వ్యాయామం మాత్రమే కాదు మన జీవన విధానం అని చాటిచెప్పండి” అని నారా లోకేశ్ వివరించారు.
Read also: Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర బృందం