తెలంగాణలో (Telangana) గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ఈ ప్రాజెక్టు పూర్తి విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు..?
హైదరాబాద్ (Hyderabad) లో మీడియాతో మాట్లాడిన కూనంనేని, కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram Project) సంబంధించి అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పంటలకు అందుతున్న నీరంతా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే వస్తోందని స్పష్టం చేశారు. కాళేశ్వరం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇది పూర్తిగా నిరుపయోగమైన ప్రాజెక్టు అని కూనంనేని అభిప్రాయపడ్డారు.
ప్రజాధనాన్ని వృథా చేయవద్దు: ప్రభుత్వానికి సూచన
ఈ పరిస్థితుల్లో ఇకపై కూడా ఈ విఫలమైన ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టడాన్ని ఆపాలని, ప్రజాధనాన్ని వృథా చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా కూనంనేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రంలోని పెద్దలు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు నేత కేశవరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అత్యంత దారుణమని కూనంనేని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ ప్రభుత్వం తొలిదశలో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకంగా చిత్రీకరించింది. కానీ కాలక్రమేణా నకిలీ పరికరాలు, తక్కువ నాణ్యతతో పనులు, భారీ అప్పులు వంటి కారణాలతో ఇది నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు భవిష్యత్తు గురించి అనేక రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Ponnam Prabhakar: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక పంపిణి