గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లండన్ గ్యాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది.

విమానం టేకాఫ్ తర్వాతనే విషాదం
ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం — బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ మోడల్ — అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:39 గంటలకు లండన్ గ్యాట్విక్కు బయలుదేరింది. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు సహా మొత్తం 242 మంది ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.
‘మేడే కాల్’.. ఆందోళనకర పరిస్థితి
విమానం కూలే ముందు మేడే కాల్ జారీ చేసినట్లు డీజీసీఏ తెలిపింది. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే ‘మేడే కాల్’ అంటారు. అయితే, ఈ ‘మేడే కాల్’కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుండి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ పేర్కొనడం గమనార్హం.
సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాద స్థలానికి అగ్నిమాపక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద సమయంలో ఉధృతంగా ఎగసిన మంటలు, పొగలు తీవ్ర ఆందోళన కలిగించాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఎయిర్ ఇండియా హాట్లైన్ ఏర్పాటు
ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక హాట్లైన్ నంబర్ (1800 5691 444) ను ప్రారంభించింది. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.
Read also: Plane Crash: కూలిన విమానంలో ప్రయాణికుల క్షేమం అనుమానమే