బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని జూన్ 4న ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం తీవ్ర విషాదంలోకి దారి తీసింది. స్టేడియం వెలుపల వేలాదిమంది అభిమానులు గుమిగూడటంతో ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు.

బాధ్యతగా రాజీనామాలు
ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ. జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. గత రెండు రోజులుగా చోటుచేసుకున్న దురదృష్టకర, ఊహించని పరిణామాల నేపథ్యంలో ఈ ఘటనలో మా పాత్ర పరిమితమైనప్పటికీ, నైతిక బాధ్యత వహిస్తూ కేఎస్సీఏ కార్యదర్శి, కోశాధికారి పదవుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం. 2025 జూన్ 6వ తేదీతో కూడిన మా రాజీనామా లేఖలను కేఎస్సీఏ అధ్యక్షుడికి సమర్పించాం అని ఆ ప్రకటనలో శంకర్, జైరామ్ పేర్కొన్నారు.
సంఘటన వెనుక పరిస్థితులు
ఆర్సీబీ అభిమానుల ప్రేమ అమితంగా ఉండటమే ఈ దుర్ఘటనకు దారితీసిన కీలక అంశంగా మారింది. ఆర్సీబీ విజయం అనంతరం, ఆటగాళ్లకు ఘన సన్మానం కల్పించేందుకు చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారికే ప్రవేశం కల్పించినప్పటికీ, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియం వెలుపల గుమిగూడారు. ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో వారిని అదుపు చేయడం కష్టతరమైంది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం
ఈ దుర్ఘటనతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. బాధితుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం తక్షణమే స్పందించింది. అలాగే, గాయపడిన వారికి సహాయం అందించేందుకు ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా కేఎస్సీఏ ఉన్నతాధికారుల రాజీనామాతో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం బెంగళూరు నగరంపైనా, క్రికెట్ వర్గాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఆర్సీబీ చారిత్రక విజయం ఆనందం ఆవిరై, విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read also: KL Rahul : ఇంగ్లాండ్ లయన్స్తో అనధికార టెస్టులో కేఎల్ రాహుల్ శతకం