హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG hospital)లో చికిత్స పొందుతున్నారు. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో అత్యున్నత చికిత్స అందుతున్నప్పటికీ, ఆయన పరిస్థితి నిలకడగా లేదన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఆరోగ్యం పట్ల తీవ్రంగా చింతిస్తున్నారని తెలుస్తోంది.
కొద్దీ రోజులుగా నివాసంలోనే చికిత్స
గత నాలుగు నెలలుగా మాగంటి గోపీనాథ్ నివాసంలోనే చికిత్స పొందుతూ ఉన్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని నిర్ధారణ కావడంతో, అప్పటి నుంచి వైద్యులు ప్రత్యేక నిఘా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల నాలుగు రోజులుగా ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి వైద్యులు ఆయన ముఖ్య అవయవాల స్పందనను పర్యవేక్షిస్తూ చికిత్సను కొనసాగిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి ఆరోగ్య బులిటెన్ వెలువడకపోయినా, లోపలి సమాచారం మేరకు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.
ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు
మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలతో మానసిక అనుబంధం ఏర్పరచుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన తీసుకున్న చొరవ ప్రజల గుర్తింపును పొందింది. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా వారి మద్దతు ప్రకటిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉండాలని ప్రజలు పిలుపునిస్తున్నారు.
Read Also : England Team: భారత్ తో తోలి టెస్ట్ ఆడనున్న ఇంగ్లండ్ జట్టు