ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) నిలవడంతో నిర్వహించిన విక్టరీ పరేడ్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట(Stampede)లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మంది గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం అల్లకల్లోలంగా మారింది. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరడంతో ఏర్పడిన తొక్కిసలాట విషాదానికి దారితీసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
సీఎం , డిప్యూటీ సీఎంలపై పిర్యాదులు
ఇక ఘటనపై పోలీసులు ‘అన్నేచురల్ డెత్’ కేసులు మాత్రమే నమోదు చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. బాధ్యత వహించాల్సిన అధికారులు, నిర్వహకులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈ ఘటనపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు కాపీని హైకోర్టుకు, డీజీపీ, బెంగళూరు పోలీస్ కమిషనర్కు కూడా పంపించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించినా, విచారణకు మేజిస్టీరియల్ ఆదేశాలు ఇచ్చినా, దీనిపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. విపక్ష బీజేపీ ఈ ఘటనను “ప్రభుత్వ ప్రాయోజిత హత్య”గా అభివర్ణించింది. హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన ఈ విషాదం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోందన్న విమర్శలు విస్తరించాయి. ఈ ఘటనపై బాధ్యులను ఖచ్చితంగా గుర్తించి శిక్షించాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also : DPS Dwarka : 32 మంది విద్యార్థుల సస్పెన్షన్ రద్దు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్