ఈ ఏడాది ఐపీఎల్ 2025 (IPL 2025) ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) (RCB) తమ ఖాతాలో వేసుకుంది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ విజయం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. జట్టును చూసేందుకు, విజయోత్సవాల్లో భాగం కావాలని వేలాది మంది చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. కానీ, ఆ ఉత్సాహమే ఓ విషాదానికి దారి తీసింది.బుధవారం సాయంత్రం నుంచే స్టేడియం బయట పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆర్సీబీ ఆటగాళ్లు ట్రోఫీతో వస్తారనే అంచనాతో చాలా మంది ముందుగానే చేరుకున్నారు. గేట్లు తెరవగానే ఒక్కసారిగా అంతా లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
50 మందికి పైగా గాయాలు – ఆసుపత్రిలో చికిత్స
తొక్కిసలాటలో 50 మందికిపైగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని శివాజీనగర్ బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.ఆర్సీబీ జట్టుకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేసింది. ఇదే విషయాన్ని ముందే ప్రకటించడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. స్టేడియం గేట్లు, దగ్గర ఉన్న గోడలు, చెట్లపైకి కూడా ఎక్కారు.
పోలీసుల లాఠీఛార్జ్, పరిస్థితి అదుపులోకి
వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయినా ఒకేసారి జన సముదాయం గేట్లపైకి దూసుకెళ్లడంతో తొక్కిసలాట తప్పలేదు. పరిస్థితిని అదుపులోకి తేనికే చాలా సమయం పట్టింది.ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందం కన్నీటి సంద్రంగా మారడం ఎంతో బాధాకరం. అభిమానులు తమ ఉత్సాహాన్ని చూపించడంలో ఒక రీతిగా పరిమితి పాటించాల్సిన అవసరం ఉంది. భద్రతా ఏర్పాట్లపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తోంది.
Read Also : RCB: బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ టీమ్..ఘన స్వాగతం పలికిన డీకే శివకుమార్