తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు (Pensions) వంటి సంక్షేమ పథకాల ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో పని చేస్తోంది. కానీ ఈ పథకాల్లో మార్జినల్ వర్గాలకు మేలు చేకూరాలన్న ఉద్దేశాన్ని కొందరు అధికారుల సహకారంతో కొందరు వ్యక్తులు వక్రీకరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామంలో బయటపడిన అవకతవకలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఒక గ్రామం పేరుతో పింఛనా?
సాధారణంగా పింఛన్లు వ్యక్తిగతంగా వారి పేర్లతో మంజూరవుతాయి. కానీ నర్సింహులపేట గ్రామంలో 2018లో మంజూరైన జాబితాలో పింఛనుదారుడి పేరు నర్సింహులపేట, తండ్రి పేరు – హచ్యా, వయస్సు 66 సంవత్సరాలుగా నమోదైంది. నర్సింహులపేట పేరిట వృద్ధాప్య పింఛను ప్రతి నెల రూ.2016 జమ అవుతోంది. ఈ పింఛను గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, ఐడీ నంబరు 22101012442 పేరిట మంజూరవుతుండగా, ప్రతి నెల ఎవరు తీసుకుంటున్నారనే విషయం మాత్రం అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఎనిమిదేళ్లుగా పింఛను తీసుకొంటూ మళ్లీ వచ్చే నెల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నారు.
నిజమైన లబ్ధిదారులకే అందుతోందా సహాయం?
నర్సింహులపేట గ్రామంలో మొత్తం 776 మంది వివిధ రకాల పింఛన్లను అందుకుంటున్నారు. ప్రతినెలా వికలాంగులకు రూ.4016, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.2016 చొప్పున అందజేస్తున్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్లో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు ఇస్తుంటారు. లబ్ధిదారుల వేలిముద్రలు సరిగ్గా రాకపోతే గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా కారోబార్ వేలిముద్రలతో తపాలా శాఖ సిబ్బంది సొమ్ము చెల్లిస్తారు.
అయితే గ్రామంలో సుమారు 20 మంది మృతి చెందిన వ్యక్తుల పేరు మీద, 50 మంది ఇతర గ్రామాలకు చెందినవారు, కొందరు ఉద్యోగులు కూడా ఆసరా పింఛన్లు పొందుతున్నట్లు నెలవారీ మంజూరు జాబితాలో పేర్లున్నాయి. ఇలా ఏళ్ల తరబడి పర్యవేక్షణ లేకపోవడంతో రూ.లక్షల్లో ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సిస్టమ్ లో లోపమా? లేక దురుద్దేశ్యమా?
ఈ పింఛన్లు బయోమెట్రిక్ ద్వారా తపాలా శాఖ ద్వారా పంపిణీ అవుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో వేలిముద్రలు సరిపోకపోతే గ్రామ కార్యదర్శి లేదా కారోబార్ వేలిముద్రలతో చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఇందులో అక్రమ చెల్లింపులకు అవకాశం ఉండటంతో, అవినీతికి దారితీసే అవకాశం ఉంది.
అధికారుల స్పందన
గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. వెంకటేశ్వర్ల మాట్లాడుతూ “ఊరు పేరు మీద పింఛన్లు మంజూరు చేయలేదని, తనకు విషయం తెలియదని” అన్నారు. ఎంపీడీవో కిన్నెర యాకయ్య కూడా “ఇలాంటి అవకతవకలు తమ దృష్టికి రాలేదని, పూర్తి విచారణ చేపట్టి జిల్లా అధికారుల ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని” చెప్పారు.
Read also: Ration Cards: ఆరు నెలలుగా రేషన్ తీసుకొని వారి కార్డులు రద్దు