దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ దీనికి తోడైంది. దీంతో ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు.. చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) ఉదయం 81,492.50 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఓ మోస్తరు శ్రేణిలో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 81,774.23 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ప్రధాన షేర్లలో అమ్మకాలతో డీలా పడిన సూచీ 80,575.09 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ (Sensex) 636 పాయింట్ల నష్టంతో 80,737 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 174 పాయింట్ల నష్టంతో 24,542.50 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, బజాజ్ఫిన్సర్వ్, బజాజ్ఫైనాన్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎంఅండ్ఎం షేరు మాత్రమే లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64.56 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3,355 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన షేర్లు రాణించడంతో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైం గరిష్ఠాన్ని తాకింది. తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లోకి జారుకుంది. కొన్ని రోజులుగా కొనుగోళ్లవైపు మొగ్గుచూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి వరుసగా అమ్మకాలకు దిగారు. సోమవారం రూ.2,589 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన నిర్ణయాలు జూన్ 6న వెలువడనున్నాయి. గత రెండు సమావేశాల్లో రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. మరోసారి కూడా ఈ రేట్లు తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి.
Read Also: Suzuki e-access: సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్