బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ (Mohammad Yunus) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పటంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా నుంచి భారీగా పెట్టుబడులు వస్తే తమ దేశ ఆర్థిక వ్యవస్థలో విశేషమైన మార్పులు రావచ్చని ఆయన అభిప్రాయపడటం, చిన్న కానీ వ్యూహాత్మక దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh) ఎలా గ్లోబల్ పెట్టుబడులపై ఆధారపడుతోంది అన్నదానికి నిదర్శనం.

చైనా-బంగ్లాదేశ్ భాగస్వామ్యం – విస్తరిస్తున్న వ్యాపార బంధం
ఈ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA) నిర్వహించగా, చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలు మంచి పేరు సంపాదించాయని కొనియాడారు. చైనాతో కలిసి పనిచేయడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ దేశంలో చైనా భారీగా పెట్టుబడులు పెడితే, దేశ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విధానాలలో పారదర్శకత – పెట్టుబడుల హామీ
యూనస్ వ్యాఖ్యల ప్రకారం, బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రూపొందించడంలో నిమగ్నమై ఉంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని యూనస్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం, చట్టాలను సరళీకరించడం, వ్యాపార కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం బలపడుతున్న తరుణంలో ఈ సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని చైనా కంపెనీలకు సూచించిన ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
చైనా పెట్టుబడుల ప్రాధాన్యత
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మహమ్మద్ యూనస్ ఇటీవల చైనా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా ఆయన సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు చైనా నుంచి పెట్టుబడులను మరింతగా పెంచాలని ఆ భేటీలో యూనస్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే బంగ్లాదేశ్లో చైనా పలువురు పెట్టుబడిదారులు మౌలిక వసతుల రంగం, టెక్స్టైల్, విద్యుత్, రవాణా రంగాల్లో పని చేస్తున్నారు. ఇక కొత్తగా తెరపైకి వస్తున్న ప్రాజెక్టుల్లో తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు (Teesta River Comprehensive Management and Restoration Project), (టీఆర్సీఎంఆర్పీ)లో పాలుపంచుకోవడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చైనా ఇస్తున్న రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని, ఆ దేశ నిధులతో నడుస్తున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజును రద్దు చేయాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.
Read also: President: కొత్త అధ్యక్షుడి కోసం దక్షిణ కొరియన్లు ఓటు