గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాన్సూన్ సీజన్ (Monsoon season)కు సంబంధించి చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్ల ప్రక్రియపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ (Letter) రాసిన ఆమె, టెండర్లను కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న విదేశీ సంస్థలకే ఇవ్వాలన్న ఉద్దేశంతో నిబంధనలను రూపొందిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
కర్ణాటక డీలర్ల ద్వారా ఎంఓయూ
విదేశీ సంస్థ వాహనాల వినియోగానికి మాత్రమే అనుమతించేలా నిబంధనలు రూపొందించారని, ఆ సంస్థకు హైదరాబాద్లో కేవలం రెండు షోరూములు మాత్రమే ఉన్నప్పటికీ, తెలంగాణ కాంట్రాక్టర్లతో ఎంఓయూలు చేసేందుకు వారు నిరాకరిస్తున్నారని తెలిపారు. కర్ణాటక డీలర్ల ద్వారా ఎంఓయూ తీసుకొచ్చినా కూడా, వాటిని తక్కువ వ్యవధిలో సమర్పించాల్సిందిగా అధికారులు ఒత్తిడి తేవడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. గతంలో వాడిన వాహనాలు ఎక్కువ సామర్థ్యంతో మెటీరియల్ను తరలించగలిగేవని గుర్తుచేశారు.
కొత్త నిబంధనల వల్ల ప్రతి ఏడాది రూ.5.85 కోట్ల అదనపు భారం
అంతేకాక, గతంలో 150 వార్డుల వారీగా టెండర్లు పిలవగా ఇప్పుడు తొమ్మిది జోన్లకే పరిమితం చేయడం వల్ల స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. కొత్త నిబంధనల వల్ల ప్రతి ఏడాది రూ.5.85 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని పేర్కొంటూ, ఈ టెండర్లను రద్దు చేసి మళ్లీ వార్డుల వారీగా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించవచ్చని కవిత సూచించారు.
Read Also : GST : మే నెలలో రూ.2.01 లక్షల కోట్ల GST వసూళ్లు