హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగి, భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులు
ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, వారి మధ్య నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండటం మరింత కలచివేసే విషయం. మృతుల్లో అభిషేక్ మోడీ (30), ఆరుషి జైన్ (17), హర్షలి గుప్తా (7), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), సుమిత్ర (65), మున్ని బాయి (72), ఇరాజ్ (2) లు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పందన
ఈ ఘోర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులతో మాట్లాడి సమాచారం పొందారు. అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంటనే ప్రమాదాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
ప్రమాదానికి కారణం ఏమిటి?
అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ అగ్ని ప్రమాదానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మంటలు మొదటగా భవనం మొదటి అంతస్తులోని గోదాంలో ప్రారంభమై, పై అంతస్తుల వరకు వ్యాపించాయి. గదులన్నీ సరిగ్గా లాకయ్యుండటంతో పలువురు బయటకి రాలేక చనిపోయారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన
ప్రమాద వార్త వెలువడిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి అగ్నిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర స్థాయిలో విచారణకు కూడా అవకాశం ఉందని సమాచారం.
Read also: Telangana: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తాం: మంత్రి పొంగులేటి