ఈనెల చివర్లో నిర్వహించనున్న మహానాడు (Mahanadu) తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మలుపు కావచ్చు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్(Lokesh)కు పార్టీ అధినేత చంద్రబాబు కీలక పదవిని ప్రకటించనున్నారన్న ఊహాగానాలు తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని రేపుతున్నాయి. పార్టీ వ్యూహరచనలో కీలకంగా ఉన్న లోకేష్కు “ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్” పదవి లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పార్టీలో నూతన శక్తి నింపేందుకు, భవిష్యత్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
నారా లోకేష్ కు ప్రమోషన్
ఇప్పటికే ప్రభుత్వంలో ఐటీ, విద్యాశాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్, పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో నిరంతరం సమావేశాలు జరిపే లోకేష్, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టంగా నిలిపేందుకు పాటుపడుతున్నారు. ముఖ్యంగా యువతతో లోకేష్కు ఉన్న కనెక్షన్ పార్టీ భవిష్యత్కు ఎంతో అవసరమన్న అభిప్రాయం తెలుగుదేశం సీనియర్లలో ఏర్పడింది. అందుకే పాత తరం నాయకత్వంతోపాటు కొత్త తరానికి మార్గదర్శకుడిగా లోకేష్ను ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
మోడీని కుటుంబ సమేతంగా కలిసిన నారా లోకేష్
తాజాగా ప్రధానమంత్రి మోదీతో కుటుంబ సమేతంగా నారా లోకేష్ కలవడం, పార్టీలో, ప్రభుత్వంలో కీలకమైన సమావేశాల్లో ఆయన పాత్ర పెరగడం ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. 2024 ఎన్నికల ముందు పాదయాత్ర ద్వారా స్టేట్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న లోకేష్, చంద్రబాబు అరెస్ట్ సమయంలో పార్టీని నిలబెట్టడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఇవన్నీ కలిపి చూస్తే, కడప మహానాడు వేదికగా లోకేష్కు పార్టీలో కీలక పదవి లభించే అవకాశం పక్కాగా కనిపిస్తోంది. ఇది టీడీపీ భవిష్యత్ నాయకత్వానికి దిశానిర్దేశకంగా నిలిచే ఘటనగా చరిత్రలో నిలిచే అవకాశముంది.
Read Also : Mishra: తమ అభిమాన పోలీసు అధికారి బదిలీతో ఏడ్చేసిన ప్రజలు