జమ్మూ కాశ్మీర్లో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో, వివాదాస్పద తులబుల్ నావిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మధ్య శుక్రవారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

సింధు జలాల ఒప్పందం: ఒమర్ అబ్దుల్లా అభిప్రాయం
భారత్ ఏప్రిల్ 23న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, Omar Abdullah వూలార్ సరస్సు వద్దగల తులబుల్ ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జీలం నదిని జలరవాణాకు ఉపయోగించుకోవచ్చని, శీతాకాలంలో దిగువన ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు.
మెహబూబా ముఫ్తీ స్పందన
ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో తులబుల్ ప్రాజెక్టును పునరుద్ధరించాలన్న ఒమర్ పిలుపు “బాధ్యతారహితమైనది, ప్రమాదకరంగా రెచ్చగొట్టేది” అని ఆమె విమర్శించారు. “ఇరు దేశాలు ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి యుద్ధం అంచుల నుంచి వెనక్కి తగ్గాయి. అమాయకుల ప్రాణనష్టం, విస్తృత విధ్వంసం, అపారమైన బాధలతో జమ్మూ కశ్మీర్ తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి సమయంలో ఇటువంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమే కాకుండా, ప్రమాదకరంగా రెచ్చగొట్టేవి కూడా” అని మెహబూబా అన్నారు.
ఒమర్ అబ్దుల్లా ప్రత్యారోపణలు
మెహబూబా వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా అంతే ఘాటుగా స్పందించారు. “చౌకబారు ప్రచారం కోసం, సరిహద్దు అవతలి కొందరిని ప్రసన్నం చేసుకునే గుడ్డి కోరికతో మీరు సింధు జలాల ఒప్పందం జమ్మూ కశ్మీర్ ప్రజల ప్రయోజనాలకు జరిగిన అతిపెద్ద చారిత్రక ద్రోహాలలో ఒకటని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఇది దురదృష్టకరం” అని ఒమర్ తన ప్రత్యర్థిపై మండిపడ్డారు.
ముదిరిన మాటల యుద్ధం
ఇరు నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. ఎవరిని ఎవరు ప్రసన్నం చేసుకుంటున్నారో కాలమే తేలుస్తుందని మెహబూబా బదులిచ్చారు. “మీ తాతగారు షేక్ సాహెబ్ అధికారం కోల్పోయిన తర్వాత రెండు దశాబ్దాలకు పైగా పాకిస్థాన్లో విలీనానికి మద్దతు పలికారని గుర్తుంచుకోవాలి. కానీ ముఖ్యమంత్రిగా తిరిగి నియమితులైన తర్వాత, భారత్తో చేతులు కలిపి అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారు” అని మెహబూబా విమర్శించారు.జమ్మూ కాశ్మీర్లో తులబుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణపై ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మధ్య జరుగుతున్న వాగ్వాదం, రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచింది. ఈ అంశం భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ రాజకీయాలకు కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
Read Also : Donald Trump : భారత్-పాక్ కాల్పుల విరమణపై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు