ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ (AP Government) ఉద్యోగుల సాధారణ బదిలీలకు(Employee transfers) ప్రభుత్వం తుది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న బదిలీల నిషేధాన్ని ఎత్తివేస్తూ, మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
గైడ్లైన్స్ ప్రకారం
ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం, ఒకే పోస్టింగులో ఐదేళ్ల సేవ పూర్తిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందిగా సూచనలు జారీ చేశారు. అదే విధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే స్థానంలో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్నవారు కూడా ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఐదేళ్లలోపు సేవ కలిగిన ఉద్యోగులకు మాత్రం వ్యక్తిగత కారణాలతో బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు.
ఉద్యోగులకు మినహాయింపులు, ప్రాధాన్యతలు
ఈసారి బదిలీల్లో సామాన్య నిబంధనలతో పాటు కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న ఉద్యోగులకు మినహాయింపులు, ప్రాధాన్యతలు కల్పించనున్నారు. 2026 మే 31వ తేదీలోగా రిటైర్ కాబోతున్న ఉద్యోగులకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అంధులైన ఉద్యోగులు, మానసిక వికాస లోపాలున్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారు, వైద్య కారణాలున్నవారు, వితంతువులైన ఉద్యోగినులు, అలాగే భార్యాభర్తలు ఒకేచోట పనిచేయాలనుకుంటే – వీరందరికీ బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. దీంతో ఈసారి బదిలీలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది.
Read Also : CBI Court : గాలి జనార్దను సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ