అమెరికాలో విద్యార్థిని మృత్యువాత – కన్నవారి కలలపై నీడ
భవిష్యత్తు వెలుగుల కోసం వేలాది మంది భారతీయ విద్యార్థులు విదేశాలకెళ్లి చదువుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు పునాది వేస్తూ, కుటుంబానికి ఆర్థిక పరంగా నిలువలనే ప్రయత్నం చేస్తూ ఎంతో మంది యువత చదువు కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలవైపు దృష్టి పెడుతున్నారు. అలాంటి లక్ష్యాలతో అమెరికా (America) వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ యువతి అనారోగ్యానికి బలై మరణించడం హృదయ విదారక ఘటనగా మారింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్రెడ్డి, శోభారాణి దంపతుల కుమార్తె ప్రియాంక (26) ప్రియాంక విద్యారంగంలో ఎంతో ప్రతిభ చూపింది. ఢిల్లీలో అగ్రికల్చర్లో బీఎస్సీ (BSc in Agriculture) పూర్తిచేసిన ఆమె, ఉన్నత విద్య కోసం 2023 జనవరిలో అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (M.S.C.) కి చేరింది. అక్కడ చదువుతోపాటు పార్ట్టైమ్ పని చేస్తూ జీవనం నెట్టుకొస్తోంది. పీజీ పూర్తి చేసిన అనంతరం ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆమె, తల్లిదండ్రులతో ప్రతిరోజూ మాట్లాడేది. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలన్నదే ఆమె లక్ష్యం. కానీ ఆ కల సాకారమవకముందే కన్నుమూయడం ఆమె తల్లిదండ్రులకు తీరని దురదృష్టం.
చిన్న అనారోగ్యమే ప్రాణాంతకం
ఈ నెల 4వ తేదీన ప్రియాంక తండ్రి వెంకట్రెడ్డితో ఫోన్లో మాట్లాడి, తాను మూడు రోజులుగా దంత సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పింది. హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, అయితే ఇన్సూరెన్స్ (Insurance) లేకపోవడంతో చికిత్స వ్యయం అధికమైందని తెలిపింది. ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసిన ఆమెకు రెండు రోజుల్లో అప్రూవల్ వచ్చింది. పత్రాలు తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన ప్రియాంకను పరీక్షించిన డాక్టర్లు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని, వెంటనే అడ్మిట్ అవాలని సూచించారు. అయితే హాస్పిటల్కి అప్పటికి ప్రిపేర్ కానని చెప్పిన ఆమె, రెండు రోజుల తర్వాత వస్తానని తిరిగిపోయింది. కానీ ఆ నిర్ణయం ఆమె ప్రాణాల మీదకు వచ్చింది.
బాత్రూంలో కుప్పకూలిన విద్యార్థిని – బ్రెయిన్ డెడ్
మే 6న స్నానం కోసం బాత్రూంకి వెళ్లిన ప్రియాంక కుప్పకూలిపోయింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను స్నేహితులు దగ్గర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారించగా, వెంటనే హెలికాప్టర్ ద్వారా సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత తీవ్రమైంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, ప్రియాంక బంధువులతో ఫోన్లో మాట్లాడిన అనంతరం వెంటిలేటర్ తీసివేయడంతో ప్రియాంక మే 8వ తేదీన మృతిచెందింది. మరో రెండు రోజుల్లో ప్రియాంక మృతదేహం హైదరాబాద్ కు చేరుకోనుంది. కూతురు ప్రియాంక ఉద్యోగం రాగానే పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు.. ఈ ఘటనతో గుండెల అవిసెలా రోదిస్తున్నారు. దీంతో ప్రియాంక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.