తాడిపత్రిలో పాత పంతాలు – ప్రజల శాంతికి ముప్పు?
తాడిపత్రి రాజకీయ సమీకరణాలు మళ్లీ వేడెక్కాయి. గత ఎన్నికల తరువాత కొంతకాలంగా మౌనంగా ఉన్న రాజకీయ ద్వేషాలు ఇప్పుడు మళ్లీ మంటలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టాలని హైకోర్టు అనుమతితో ప్రయత్నిస్తుండగా, ఆయన్ని అడ్డుకోవాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తలచుకోవడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో చెలరేగిన హింసా ఘటనలు ప్రజల గుండెల్లో ఇంకా చెరగని ముద్ర వేసాయి. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ తలెత్తుతుందేమోనన్న భయం పట్టణ ప్రజలను కలవరపెడుతోంది.
పెద్దారెడ్డి తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకోవడమే తన ధ్యేయంగా జేసీ ప్రభాకర్రెడ్డి పంతం పట్టడంతో, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. హైకోర్టు అనుమతి ఉన్నా కూడా పరిస్థితుల దృష్ట్యా పోలీస్ శాఖ అతనికి భద్రత కల్పించడం పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే జిల్లా అధికారులు భద్రత పెంచుతూ, దాదాపు 200 మంది పోలీసులను తాడిపత్రిలో మోహరించారు. చిన్నపాటి నాయకుల దగ్గర నుంచి రౌడీషీటర్ల వరకు పోలీసుల హెచ్చరికలు వెల్లువెత్తాయి. గతంలో జరిగిన అల్లర్లలో కూరుకుపోయిన వాళ్లకు ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న ఆందోళన మొదలైంది. కుటుంబాలకు దూరమవడం, ఆర్థిక ఇబ్బందులు, కేసుల భయంతో అనేకమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
పెద్దారెడ్డికి రాక వాయిదా పడేనా
పెద్దారెడ్డి తాడిపత్రికి రావడాన్ని అడ్డుకునేందుకు గతంలో రెండు మూడు సార్లు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈసారి మాత్రం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన పర్యటన ఖాయమన్న అభిప్రాయం ఉంది. కానీ అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్న నేపథ్యంలో పోలీసులు పెద్దారెడ్డికి రాక వాయిదా వేసే సూచనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక పోలీసులు మద్యవర్తులుగా వ్యవహరించాల్సిన దశకి వచ్చారు. ఒకవైపు హైకోర్టు ఆదేశాలు, మరోవైపు స్థానిక నాయకుల గట్టి పంతాలు పోలీసు యంత్రాంగాన్ని కఠిన స్థితిలోకి నెట్టాయి. గతంలో జరిగిన పొరపాట్లు గుర్తుకు తెచ్చుకుంటూ జిల్లా పోలీసులు ఇప్పుడు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజకీయ ప్రతీకారం – ప్రజలపై ప్రభావం
తాడిపత్రిలో రాజకీయ నాయకుల పంతాలు ప్రజల జీవితాలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఒక నాయకుడి రాకపై మరో నాయకుడి వ్యతిరేకత, దానికి మద్దతుగా నిలిచే కార్యకర్తలు – ఇవన్నీ చివరికి సామాన్య ప్రజల శాంతికి ముప్పుగా మారే ప్రమాదం ఉంది. పోలీసులు అల్లర్లపై పీడీయాక్ట్ లాంటి తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న విషయం తెలియడంతో నాయకుల్లో కేసుల భయం పెరిగింది. ప్రజల శ్రేయస్సు కంటే వ్యక్తిగత ప్రతిష్ఠకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తాడిపత్రి మళ్లీ ఉద్రిక్తతకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందన్నది వాస్తవం.
Read also: Nimmala Ramanaidu: మరోసారి జగన్ పై విరుచుకుపడ్డ మంత్రి నిమ్మల
Read also: Andhra Pradesh: కూతురు రెండో పెళ్లి కోసం మనవరాలిని చంపిన అమ్మమ్మ