భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ – IAF) ఆదివారం కీలక ప్రకటన చేసింది. “ఆపరేషన్ సిందూర్”లో భాగంగా తమకు అప్పగించిన లక్ష్యాలను పూర్తిగా నెరవేర్చామని, అత్యంత కచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొంది. ప్రస్తుతం ఇంకా కొన్ని కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వవద్దు” అని ఐఏఎఫ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కోరింది.

భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం
శనివారం (మే 10) నాటికి భారత్ – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే పాక్ సైన్యం మరొకసారి ఉల్లంఘనలు మొదలుపెట్టింది. శ్రీనగర్తో పాటు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా కూల్చేసింది. దీంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత్ మీడియాకు వెల్లడించింది.
పాక్ డ్రోన్ దాడులకు భారత్ ఘాటు ప్రతిచర్య
పాకిస్థాన్ పంపిన డ్రోన్లను భారత భద్రతా బలగాలు గమనించి, విజయవంతంగా కూల్చేశాయి. ఈ చర్యలు “ఆపరేషన్ సిందూర్”లో భాగంగానే జరిగాయన్న అభిప్రాయం ఉంది. పాక్ తీసుకున్న ఈ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని భారత్ అధికారికంగా పేర్కొంది. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పరిస్థితిని బాధ్యతాయుతంగా ఎదుర్కోవాలని పాకిస్థాన్కు సూచించారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉల్లంఘనలు పునరావృతమైనా దృఢంగా వ్యవహరించాలని సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Read also: Ajit Doval : చైనా విదేశాంగ మంత్రితో దోవల్ ఫోన్లో సంభాషణ