పీఎస్ఎల్ రద్దు.. భయభ్రాంతులకు గురైన విదేశీ క్రికెటర్లు
పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ఈసారి అనుకోని పరిణామాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. భారత్ – పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా టోర్నమెంట్ను మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో పీఎస్ఎల్లో పాల్గొన్న అనేకమంది విదేశీ క్రికెటర్లు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోయారు. రషీద్ హుస్సేన్, దారెల్ మిచెల్, సామ్ బిల్లింగ్స్, కుశాల్ పెరీరా, డేవిడ్ వైస్, టామ్ కర్రస్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పాకిస్థాన్ను విడిచారు. వీరిలో చాలామంది తమ సొంత దేశాలకు బయలుదేరగా, మరికొందరు దుబాయ్ ద్వారా ట్రాన్సిట్లో ఉన్నారు.
“ఇంకెప్పుడూ పాకిస్థాన్కు రాను!” – దారెల్ మిచెల్
ఈ క్రమంలో బంగ్లాదేశ్ వెళ్లేందుకు దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్న రషీద్ హుస్సేన్ అక్కడ మీడియాతో మాట్లాడారు. “మేము పీఎస్ఎల్ ఆడటానికి చాలా ఉత్సాహంగా వచ్చాం. కానీ ఇటీవలి రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిస్థితుల దృష్ట్యా మేమంతా చాలా భయాందోళనకు లోనయ్యాం. పీఎస్ఎల్లో ఉన్న ప్రతి ఒక్క విదేశీ ఆటగాడు కూడా ఒకటే మాట అంటున్నాడు – ‘ఇంకెప్పుడూ ఇక్కడికి రాము’. జీవితంలో ఇంకెప్పుడూ పాకిస్థాన్ వెళ్లబోనని దారెల్ మిచెల్ తనతో అన్నట్లు రషీద్ వెల్లడించారు.
“ఇంటికి బాగానే చేరుతానో లేదో!” – టామ్ కర్రస్ కన్నీటిపర్యంతం
రషీద్ హుస్సేన్ చెప్పిన వివరాల ప్రకారం, టామ్ కర్రస్ పరిస్థితి మరింత విషమంగా ఉంది. టామ్ కర్రస్ అయితే ఇంటికి క్షేమంగా చేరుకుంటానో లేదోనని తీవ్రంగా భయపడటంతో పాటు విపరీతంగా ఏడ్చేశాడని, అతన్ని ఓదార్చడం చాలా కష్టమైందని ఆయన అన్నారు. తమ కుటుంబాలు చాలా ఆందోళన చెందాయని, దేవుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని రషీద్ పేర్కొన్నారు.
పీఎస్ఎల్ భద్రతపై ప్రశ్నార్ధక చిహ్నం
ఈ పరిణామాల నేపథ్యంలో పీఎస్ఎల్ నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీ ఆటగాళ్ల భద్రతను సురక్షితంగా నిర్వహించలేని పరిస్థితి సిరీస్కు తీవ్ర దెబ్బతీసింది. విదేశీ ఆటగాళ్లు ఈ అనుభవాల కారణంగా భవిష్యత్తులో పాకిస్థాన్ టోర్నీలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది పాక్ క్రికెట్ ఇమేజ్కు కూడా హానికరం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also: Sports: ఐపీఎల్ను ఇంగ్లాండ్లోనే పూర్తి చేయాలని సూచనలు చేసిన మైఖేల్ వాఘన్