పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున కచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ కీలక పరిణామం అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన వివరాలను ప్రధాని రాష్ట్రపతికి వివరించారు.

పక్కా సమాచారంతోనే దాడులు
ఈ దాడుల్లో భాగంగా, పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది కీలక స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ధ్వంసం చేసిన వాటిలో ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయని తెలిసింది. భారతదేశంపై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం, వాటిని నిర్దేశించడం వంటి కార్యకలాపాలు ఈ కేంద్రాల నుంచే జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే సైన్యం ఈ దాడులు చేపట్టింది.
రెండు వారాల క్రితం జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక నేపాల్ దేశస్థుడితో సహా 26 మంది అమాయక పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటన జరిగిన అనతికాలంలోనే భారత సాయుధ దళాలు ఈ ప్రతిదాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.
Read Also : Operation Sindhur: భారత్ దాడులతో పాకిస్థాన్లో రెడ్ అలర్ట్