పహల్గాం దాడికి బలమైన ప్రతీకారం: ఆపరేషన్ సిందూర్
భారతదేశాన్ని విషాదంలో ముంచేసిన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఘటనకు భారత సైన్యం బదులు తీర్చుకుంది. మే 7, 2025 అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ అనేది కేవలం ఒక ప్రతీకార చర్య మాత్రమే కాదు, భారత భద్రతా వ్యవస్థ ఎంత గట్టిదో ప్రపంచానికి చాటిచెప్పిన ఆత్మవిశ్వాస ప్రదర్శన. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా పురుషులను లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపారు. వారి భార్యల నుదుట సిందూరం తుడిచివేయబడింది. అందుకే ఈ ప్రతీకార దాడికి ‘సిందూర్’ అనే పేరును భారత సైన్యం ఎంచుకుంది.
ఉగ్రవాద స్థావరాలపై సమర్థ దాడులు
ఈ మెరుపుదాడుల్లో భారత ఆర్మీ మొత్తం తొమ్మిది ప్రధాన ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. వీటిలో నలుగురు పాక్ భూభాగంలో ఉండగా, ఐదు పీఓకేలో ఉన్నాయి. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల ప్రధాన శిక్షణా కేంద్రాలు ఈ దాడిలో తుడిచిపెట్టబడ్డాయి. ముజఫరాబాద్, కోట్లి, గుల్పూర్, భీమ్బర్, సియాల్కోట్, చకంబ్రూ, మురీడ్కే, బహావల్పూర్ వంటి ప్రదేశాల్లో భారత బలగాలు అద్భుతమైన ప్రెసిషన్ స్ట్రైక్స్ నిర్వహించాయి. ఈ దాడుల్లో ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ స్థావరం మురీడ్కే సైతం ఉంది. ఇది ఈ ఆపరేషన్ విజయవంతతను మరింత బలంగా చాటుతోంది.
కేవలం ఉగ్రశిబిరాలే లక్ష్యం
భారత ఆర్మీ ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఎటువంటి ప్రహారానికి గురి చేయలేదు. కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన శిక్షణా శిబిరాలపై మాత్రమే దాడులు జరిపారు. కమ్యూనికేషన్ కేంద్రాలు, ఆయుధ నిల్వలు, టాప్ ఉగ్ర నాయకుల గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలకు కేంద్రంగా మారిన ప్రదేశాలు మాత్రమే లక్ష్యంగా తీసుకున్నారు. ఈ దాడులు అత్యంత ప్రణాళికతో, ఖచ్చితత్వంతో నిర్వహించబడినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు “జై హింద్”, “ఇండియన్ ఆర్మీ జిందాబాద్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు సైతం భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నట్టు పోస్టులు చేస్తున్నారు.
మోదీ పర్యటనల రద్దు – ఉద్రిక్తతల నేపథ్యం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మధ్యలో జరగాల్సిన యూరప్ పర్యటనను రద్దు చేశారు. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటనలు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయ్యాయి. ప్రధాని కార్యాలయం ప్రకారం, మోదీ ఈ ఆపరేషన్ను ఎప్పటికప్పుడు సమీక్షించడమే కాక, రక్షణ శాఖతో నేరుగా సమన్వయం చేస్తున్నారు. ఇది ఈ చర్యకు ప్రభుత్వ మద్దతు ఎంత బలంగా ఉందో సూచిస్తోంది.
read also: Sai Pallavi: సాయిపల్లవి రెమ్యునరేషన్ పై బాలీవుడ్ లో ఎందుకు ఇంత చర్చ