పెహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలను భారత్ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమదులపై భారత్ నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
దిగుమతులపై తక్షణ నిషేధం
పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువులపైన ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా స్వేచ్ఛయుత దిగుమతులైన పాక్ నుంచి ఎలాంటి వస్తువులకు అనుమతి ఉండదు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నిషేధం నుంచి ఏమైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. దేశభద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం అని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటనలో ప్రకటించింది. అయితే భారత్, పాక్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకేక రవాణ మార్గం అటారి సరిహద్దు ఇప్పటికే దాన్ని భారత్ మూసివేసింది.
గతంలో ఆంక్షలు మరియు వాణిజ్య గణాంకాలు
2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి పాక్ నుంచి చాలా వరకు దిగుమతులు తగ్గించుకుంది. పాక్ ఉత్పత్తులపై 200% సుంకాన్ని భారత్ విధిస్తుంది. ఇక అప్పటి నుంచి కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజల వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు 447.65 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. కానీ పాక్ నుంచి కేవలం 0.42 మిలియన్ డాలర్ల ఉత్పత్తులను మాత్రమే భారత్కు దిగుమతి అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% – 1.1 శాతం మాత్రమే ఉంది.