ఇది తెలుగు సినిమా ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయిన కథ. 1990లో విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ సినిమా మే 9న తిరిగి విడుదల కానుంది. ఈ ఏడాది సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, రీమాస్టర్ చేసిన వెర్షన్ను భారీగా విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

అప్పట్లో లావిష్ బడ్జెట్తో, ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి “రాజు” అనే సాధారణ టూరిస్ట్ గైడ్ పాత్రలో మెప్పించగా, శ్రీదేవి “ఇంద్రజ” అనే స్వర్గానికి చెందిన దేవకన్యగా కనిపించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశారు.వారి మధ్య ప్రేమ, ఫాంటసీ, మానవతా విలువల సమ్మేళనమే ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపింది.1990 మే 9న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకు బ్లాక్లో టికెట్ ధర ఏకంగా రూ.210కి చేరడం వింటేనే అర్థమవుతుంది సినిమా హైప్ ఏ స్థాయిలో ఉందో. కేవలం రూ.6.50 విలువైన టికెట్ను అందుకోలేక అభిమానులు పోటీ పడిన దృశ్యాలు అప్పటి దినపత్రికల్లో ప్రధానమైనవే.ఈ సినిమాలోని పాటలు ఎన్నటికీ మరువలేనివి. ముఖ్యంగా ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ పాట గురించి చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తు చేశారు.
“ఆ పాటకు ఇళయరాజా గారు ఒకేరోజులో ట్యూన్ ఇచ్చారు.ఉదయం 9కి ప్రారంభించి మధ్యాహ్నానికి సిద్ధం చేశారు. వెంటనే వేటూరి గారు సాహిత్యం అందించి, బాలు గారు తనదైన శైలిలో పాడారు అని చెప్పారు.ఇంకొక సూపర్ హిట్ పాట ‘అందాలలో అందమే’ గురించి దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఓ మానవుడు, ఓ దేవత ప్రేమలో పడటం ప్రేక్షకులకు స్పష్టంగా అర్థం కావాలి. ఆ భావనను పాట రూపంలోనే బలంగా చూపాలనుకున్నాం. అందుకే ఆ పాట అలా అద్భుతంగా చిత్రీకరించాం అని వివరించారు.ఈ ఐకానిక్ సోషియో ఫాంటసీ సినిమా మళ్లీ థియేటర్లలో వస్తుండటం అంటే ఒక తరం సినీప్రేమికులకు కొత్త అనుభవం. నేటి తరం ప్రేక్షకులు కూడా ఈ కాస్మిక్ ప్రేమకథను ఎంజాయ్ చేయాల్సిందే. జగదేకవీరుడు అతిలోకసుందరి మళ్లీ తెరపైకి రావడం అంటే తెలుగు సినిమా చరిత్రలో మరోసారి సంబరం నెలకొనడం.
Read Also : Music Director: హిట్ 3 బీజీఎం పై విమర్శలు స్పందించిన మిక్కీ జే మేయర్