బెంగళూరులోని మారతహళ్లి ప్రాంతంలోని రద్దీగా ఉండే ఎకో వరల్డ్ ఐటీ పార్కులో ఓ యువతిపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న బాధితురాలిపై వెనుక నుంచి ఎవరో బలంగా ఢీకొట్టినట్లు అనిపించిందని ఆమె వివరించారు. మొదట అది ప్రమాదవశాత్తు జరిగిందేమో అనుకున్నప్పటికీ, అదే చర్య రెండుసార్లు పునరావృతం కావడంతో అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆమెకు స్పష్టమైంది.
బాధితురాలు సహాయం కోసం కేకలు
ఘటన అనంతరం బాధితురాలు సహాయం కోసం కేకలు వేసినప్పటికీ, చుట్టుపక్కల ప్రజలు స్పందించకపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. “అక్కడ చాలా మంది ఉన్నారు, ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు” అని ఆమె విచారంతో చెప్పింది. మూడోసారి అదే వ్యక్తి మళ్లీ ఆమె వైపు వస్తుండగా, ఆమె అక్కడి సెక్యూరిటీ బూత్కి వెళ్లి సహాయం పొందగలిగింది. మహిళలు ఇలాంటి వేధింపుల విషయంలో ధైర్యంగా ముందుకు వచ్చి తమ అనుభవాలను బయటపెట్టాలని, అప్పుడు తప్ప నేరస్తులు గట్టిగా శిక్షించబడతారని ఆమె అభిప్రాయపడింది.
బాధితురాలు ఫిర్యాదు
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు వ్యక్తిగతంగా ఈ కేసును పరిశీలిస్తున్నారని ఆమె వెల్లడించారు. “ఈ ఘటనపై నేను మాట్లాడకపోతే, ఆ వ్యక్తి మరెందరినో ఇలానే వేధించేవాడు. అందుకే నేరాలపై నిశ్శబ్దంగా ఉండకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి” అని ఆమె వ్యాఖ్యానించింది. ఈ ఘటన నేడు మహిళా భద్రతపై సమాజం పునరాలోచించాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తుచేస్తోంది.
Read Also : Black tomato: నల్ల టమాటాలతో నలబై ప్రయోజనాలు