పాలమూరు ప్రాజెక్టులకు నూతన ఊపందిస్తున్న ప్రభుత్వం: గత పాలనలో నిర్లక్ష్యం, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పూర్తి పనులు
మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు నార్లాపూర్ వద్ద ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని తనిఖీ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో, అంటే మార్చి 2026లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులు చాలా మందగించాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా విద్యుత్ ఏర్పాట్లు లేకపోవడం, పంపులు పని చేయకపోవడం వల్లే ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో నిలిచిపోయాయని వెల్లడించారు. ఇప్పుడు విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం జరిపి రూ.262 కోట్లు విడుదల చేసి అవసరమైన పనులను వేగవంతంగా చేపట్టామన్నారు.

Telangana : పాలమూరు ప్రాజెక్టులకు వేగం
నార్లాపూర్ వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ను ఈ నెలాఖరులోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే, పంపులను రిపేర్ చేసి త్వరలో పంపింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. భూసేకరణ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆర్ఆండ్రార్ ప్యాకేజీలను త్వరగా పూర్తిచేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి సదుపాయం మెరుగుపడి, రైతులకు ఊరట కలుగుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేనా ప్రాజెక్టులను పూర్తిచేసి 50 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 6 నెలల టైంఫ్రేమ్తో ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.ఇదిలా ఉండగా, సందర్శన సమయంలో ప్రాజెక్టు ముంపు ప్రాంత రైతులు మంత్రికి వినతి పత్రం అందజేస్తూ, తమకు ఆర్ఆండ్రార్ ప్యాకేజీలో పరిహారం చెల్లించాలని కోరారు. మంత్రి వెంట ఉన్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డిసిసిబి అధ్యక్షులు మామిళ్ళపల్లి విష్ణువర్దన్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు ప్రస్తుత పురోగతిని వివరించారు. మొత్తం మీద, ఈసారి పాలమూరు ప్రాజెక్టులు వాస్తవంగా పూర్తి కాబోతున్నాయనే నమ్మకాన్ని రైతుల్లో కలిగించారు.
Read More : Tomato Fight : హైదరాబాద్లో ‘టమాటా ఫైట్’ మీరు సిద్ధమా..!