జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న ఘోరమైన ఉగ్రవాద దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో దాయాది దేశమైన పాకిస్థాన్పై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్పై ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్న దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, దీనిలో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది.

పాకిస్థానీ పౌరులకు భారత్ వీడాలని కేంద్రం ఆదేశాలు
ఏప్రిల్ 24న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, భారత్లో తాత్కాలిక వీసాలతో ఉన్న పాకిస్థాన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది. వారికి గడువుగా ఏప్రిల్ 27వ తేదీని నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో, అట్టారి-వాఘా సరిహద్దు గుండా 537 మంది పాకిస్థానీ పౌరులు, అందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోయారు. ఇది భారత్ తీసుకున్న చర్యల తీవ్రతకు నిదర్శనం. ఇక మరోవైపు, పాకిస్థాన్లో ఉన్న 850 మంది భారతీయులు కూడా భారత్లోకి తిరిగి వచ్చారు. పన్నెండు రకాల స్వల్పకాల వీసాలు ఉన్న పాకిస్థాన్ పౌరులు దేశం వీడాలని భారత్ విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. ఇక, మెడికల్ వీసాలు కలిగిన వారికి రేపటి వరకు గడువు ఉంది.
గడువులోగా వెళ్ళని వారిపై కఠిన శిక్షలు
భారత్లో ఉన్న పాకిస్థానీయులు చెప్పిన సమయంలోగా దేశం వీడకపోతే నేరుగా జైలుకు పంపుతామంటూ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 4న అమలులోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం గడువు ముగిశాక భారత్లో ఉన్న పాక్ పౌరులకు మూడేళ్ల జైలు/రూ. 3లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ స్పందన
తాజాగా జరిగిన “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ దాడిలో అమరులైన 26 మందికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నేరస్థులు ఎంతటి స్థాయిలో కుట్రలు పన్నినప్పటికీ, వారిని ఉపేక్షించమని, తప్పకుండా కఠినమైన శిక్షలు పడతాయని మోదీ పునరుద్ఘాటించారు. పహల్గామ్ దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇప్పటికే రంగంలోకి దిగింది. బుధవారం నుంచి NIA బృందాలు ఘటనాస్థలిలో బస చేస్తూ, ఆధారాల కోసం ముమ్మర అన్వేషణ జరుపుతున్నాయి. నిందితుల నెట్వర్క్ను గుర్తించేందుకు, దాడి వెనుక ఉన్న ఉగ్రసంస్థల ప్రమేయాన్ని బయటపెట్టేందుకు ఎన్ఐఏ శ్రమిస్తోంది.
Read also: Phalgam Terror Attack: పహల్గామ్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి