హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించిన కేటీఆర్, రాహుల్ గాంధీ తన పర్యటనలో కొన్ని ప్రాంతాలను సందర్శించాలని సూచించారు. #CongressFailedTelangana హ్యాష్ట్యాగ్ జత చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాలను గుర్తు చేశారు. లగచర్ల, సుంకిశాల, మూసీ తీర ప్రాంతాలు, హెచ్సీయూ గచ్చిబౌలి, గురుకుల విద్యార్థుల మృతి స్థలాలు వంటి ప్రాంతాలను రాహుల్ సందర్శించాలని చెప్పారు.
కాంగ్రెస్ పాలన వైఫల్యాలను గుర్తుచేసిన కేటీఆర్
కేటీఆర్ తెలిపినప్రాంతాలు అన్నీ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఘోర వైఫల్యాలను సూచిస్తున్నాయి. ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థుల మరణాలు, రైతుల ఆత్మహత్యలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వంటి ఘటనలు రాష్ట్రంలో కాంగ్రెస్ సమయంలో జరిగినవని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే, వారి పార్టీ పాలన రాష్ట్రానికి కలిగించిన నష్టాన్ని బాగా తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. దీంతో పాటు ఫోర్త్ సిటీ, అశోక్నగర్ ప్రాంతాలను కూడా సందర్శించి, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఎంతగా విఫలమయ్యాయో చూచుకోవాలని సూచించారు.
ఎద్దేవా చేస్తూ చివరికి సలహా
సీరియస్ వ్యాఖ్యలతో పాటు కేటీఆర్ కొద్దిగా వ్యంగ్య ధోరణిలో కూడా స్పందించారు. రాహుల్ గాంధీకి, ఈడీ కేసుల నుంచి బయటపడటానికి కూడా తమ రెవెన్యూ మంత్రిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. మొత్తానికి రాహుల్ పర్యటనను రాజకీయంగా చురకలు అంటించే అవకాశంగా మలుచుకున్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మరోసారి ప్రజల ముందు ప్రస్తావించారు.