ఆరెంజ్ ఆర్మీ దారుణ ప్రదర్శన – ప్లే ఆఫ్స్ ఆశలు మసకబారేనా?
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిరాశాజనక ప్రదర్శనను కొనసాగిస్తోంది. ముంబై ఇండియన్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. ఇది సన్ రైజర్స్కు ఆరో ఓటమిగా నిలిచింది. హాట్ ఫేవరెట్గా, డిఫెండింగ్ రన్నరప్గా టోర్నీలో అడుగుపెట్టిన ఈ జట్టు తారస్థాయిలో నిలవలేకపోయింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేకపోవడాన్ని ఈ పరాజయం మరింత స్పష్టం చేసింది.రాజస్థాన్ రాయల్స్తో తొలి మ్యాచ్లో 286 పరుగుల రికార్డ్ స్కోర్ చేసి విజయంతో సీజన్ను ఆరంభించిన సన్ రైజర్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటములు చవిచూసింది. పంజాబ్ కింగ్స్పై 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రెండో విజయం నమోదు చేసిన తర్వాత కూడా జట్టు ఫామ్ అందుకోలేకపోయింది. ముంబైతో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ ప్రస్తుతం 8 మ్యాచుల్లో 2 విజయాలతో 9వ స్థానంలో ఉంది.లీగ్ దశలో సన్ రైజర్స్కు ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచుల్లో అన్నింటిని గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు చిగురించవచ్చు. ఒక మ్యాచ్లోనైనా ఓడితే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెట్ రన్రేట్ (-1.361) కూడా దారుణంగా ఉంది. కాబట్టి విజయాలతో పాటు నెట్ రన్రేట్ మెరుగుపరచడం కూడా అత్యంత అవసరం.

IPL 2025 : సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుత ప్రదర్శన అవసరం
ఈ నెల 25న చెన్నై సూపర్ కింగ్స్తో, మే 2న గుజరాత్ టైటాన్స్తో, మే 5న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 10న కోల్కతా నైట్ రైడర్స్తో, మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో, మే 18న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. వీటిలో రెండు మ్యాచ్లు మాత్రమే హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి.జట్టుకు ప్రధాన బలం అయిన బ్యాటింగ్ విభాగమే ఇప్పుడు బలహీనంగా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి తదితర టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వరుస వైఫల్యాలతో జట్టును కిందకు లాక్కొస్తున్నారు. అనవసరంగా షాట్లు ఆడుతూ వికెట్లను కోల్పోతుండటం జట్టు ఆశలపై నీళ్లు చల్లుతోంది. స్ట్రోక్ మేకింగ్ బ్యాటర్ లేకపోవడం కూడా ప్రధాన లోపంగా మారింది.బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విభాగం కూడా నిరాశ పరుస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం, అనుభవం ఉన్న మహ్మద్ షమీ తేలిపోవడం, సమర్జిత్ సింగ్, ఉనాద్కత్, ఇషాన్ మలింగా వంటి బౌలర్లపై నమ్మకం ఉంచే స్థితి లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆరెంజ్ ఆర్మీకి అద్భుత ప్రదర్శనలే ఇప్పుడు ఆశలు రగిలించగలవు.
Read More : Suresh Raina: కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికి తప్పు చేశాడు: సురేష్ రైనా