రేవంత్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. కారణం – ఆయనపై నాంపల్లిలో నమోదైన పరువు నష్టం కేసు. ఇప్పుడు ఆ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ రేవంత్, హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ సాగుతోందన్న సంగతి తెలిసిందే.ఈ కేసుకు నేపథ్యం ఓ ఎన్నికల సభ. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలం. ఆయన ప్రసంగాన్ని తప్పుగా విశ్లేషిస్తూ, బీజేపీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు.వెనుక సంగతి చూస్తే, రేవంత్ రెడ్డి బహిరంగ సభలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు. ఇది బీజేపీ పరువు నష్టానికి కారణమవుతుందంటూ వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో కేసు పెట్టారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది.ప్రజాప్రతినిధుల కోర్టు కేసును విచారణకు స్వీకరించింది.

ఇప్పటికే కొంతమంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంది.రేవంత్ చేసిన వ్యాఖ్యల ఆడియో, వీడియో ఆధారాలు కూడా కోర్టులో వున్నాయి. విచారణ రఫ్గా ముందుకు సాగుతోంది.అయితే, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసు తనపై కొనసాగకుండా ఉండాలని కోరారు. హైకోర్టులో పిటిషన్ వేసి, విచారణ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, తన వ్యక్తిగత హాజరును మాఫీ ఇవ్వాలని కూడా కోరారు.ఈ పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేయనున్నట్లు సమాచారం.
కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరిన రేవంత్ అడుగుపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.ఇక రేవంత్ రెడ్డి పిటిషన్ వేయడం వెనుక ఉన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యమంత్రి అయిన తర్వాత, కోర్టుల్లో తిరుగుతూ ఉండడం ఆయనకు ఇబ్బందిగా మారింది. అధికార భాధ్యతలతో పాటుగా న్యాయ ప్రక్రియలో ఉండటం బిజీ రాజకీయ నేతలకు పెద్ద భారం అవుతుంది.ఇకపోతే, ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీయవచ్చు. రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తిచూపుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఎదురుదెబ్బగా మారినట్టు కనిపిస్తోంది.సోషల్ మీడియాలో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. కొంతమంది రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఇది న్యాయ ప్రక్రియ నుంచి పారిపోవడమేనంటున్నారు.ఇక ఈ కేసు ఎలా ముగుస్తుందో, హైకోర్టు రేవంత్ అభ్యర్థనపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు – తెలంగాణ రాజకీయ వేడి ఇక ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Read Also : భారత్ ఉగ్రదాడిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటుంది : ఎంపీ ఈటల