తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి, స్వయం సమర్థతకు బలమైన బాటలు వేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో మొదటి దశగా పూర్తిగా మహిళల చేత నడపబడే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనున్నారు. మహిళా శక్తి పథకం కింద ఈ ప్రాజెక్టును చేపట్టి, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) తో 20 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒక్కో బంకు ఏర్పాటుకు సుమారు రూ. 2 కోట్ల వ్యయం అంచనా వేయబడింది.
ఉపాధి అవకాశాల వేగం– మహిళలకు ఉద్యోగ అవకాశాలు
ఈ పెట్రోల్ బంకుల ద్వారా జిల్లా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రతి బంకులో 15 నుండి 20 మంది మహిళలు షిఫ్ట్ల్లో పని చేయనున్నారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసైన మహిళలకు ఫ్యూయల్ నింపడం, క్యాషియర్ బాధ్యతలు అప్పగించనుండగా, డిగ్రీ పాసైన మహిళలను మేనేజర్ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎంపికైన మహిళలకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఇది మహిళలకు తన కాళ్లపై తాను నిలబడి జీవనం సాగించేందుకు సరైన వేదికగా నిలవనుంది.
సామాజికంగా మహిళల ప్రతిష్ఠకు దోహదం
ఈ వినూత్న కార్యక్రమం మహిళల ఆర్థిక స్థితిని మాత్రమే కాక, వారి సామాజిక ప్రతిష్ఠను కూడా పెంపొందించనుంది. మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలకే పరిమితం కాకుండా, ఆధునిక రంగాలలోనూ తమ స్థానాన్ని సాధించగలరన్న నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బంకుల ఏర్పాటు పనులు వేగంగా సాగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా సాధికారత కోసం ఈ తొలి అడుగు భవిష్యత్తులో మరెన్నో అవకాశాలకు ద్వారంగా మారనుంది.