తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు రద్దు చేసింది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఓ ఘటనలో, మూసీ నది ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసిందని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయడంతో, ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
న్యాయపరంగా సరైన ఆధారాలు లేవు
KTR చేసిన ఆరోపణలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయంటూ సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు న్యాయపరంగా సరైన ఆధారాలపై ఆధారపడలేదని, వ్యక్తిగత విమర్శల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయపరంగా అన్యాయం అని KTR తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిని పరిశీలించిన హైకోర్టు, ఈ కేసులో ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాలు ఫిర్యాదు కోణానికి సరిపోవడం లేదని స్పష్టం చేసి ఎఫ్ఐఆర్ను కొట్టేసింది.
బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు
ఈ తీర్పుతో KTRకు పెద్ద ఊరట లభించింది. రాజకీయ విమర్శలను వ్యక్తిగత దూషణలుగా అభివర్ణించడం సరికాదని, విమర్శలకు ప్రతిస్పందన రాజకీయ పరిధిలో ఉండాలంటూ న్యాయస్థానం సూత్రప్రాయంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.