Maoists : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. అయితే, లొంగపోయిన వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. వారంతా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్) సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు చెప్పారు.

ఒకరిపై రూ.50వేలు రివార్డు
లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, అతడి భార్య, స్క్వాడ్ సభ్యురాలు ముచాకి జోగి ఉన్నారని వెల్లడించారు. వీరిపై రూ.8 లక్షల రివార్డు ఉండగా.. మావోయిస్టుల ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉందన్నారు. మరో ఏడుగురిపై రూ.2 లక్షల చొప్పున రివార్డు, ఒకరిపై రూ.50వేలు రివార్డు ఉన్నట్లు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.50,000 సాయం అందించామని.. ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. గతేడాది సుక్మాతో సహా బస్తర్ ప్రాంతంలో దాదాపు 792 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు.
మావోయిస్టులు లేని భారత్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా మావోయిజాన్ని తుడిచిపెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యప్రదేశ్లో నిర్వహించిన సీఆర్పీఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవాల పరేడ్లో అమిత్ షా మాట్లాడారు. మావోయిస్టులు లేని భారత్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మావోయిస్టుల ఏరివేత మిషన్కు సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అండగా నిలిచిందని ప్రశంసించారు. దీంతో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు 70శాతానికి పైగా తగ్గి ఇప్పుడు ముగింపు దశకు చేరాయన్నారు.
Read Also: మహారాష్ట్రకు చేరిన హిందీ వివాదం..ప్రభుత్వం ఉత్తర్వులపై విపక్షాల ఆగ్రహం