హైదరాబాద్ వాసులకు ఒక శుభవార్త కాదు కానీ, అవసరమైన అప్డేట్ మెట్రో రైలు ప్రయాణం త్వరలో కొంచెం ఖర్చుతో ఉండొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఛార్జీలు మారబోతున్నాయని, వాటిపై భారం పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ సంస్థపై ఉన్నాయి. కానీ ఈ సంస్థకు భారీ ఆర్థిక నష్టాలు వస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం, మెట్రో ప్రాజెక్ట్ వల్ల కంపెనీకి దాదాపు రూ.6,500 కోట్ల నష్టం వచ్చిందట. దీంతో ఆదాయాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా ప్రయాణ ఛార్జీలను పెంచే దిశగా సంస్థ ఆలోచిస్తోంది.

బెంగళూరు మెట్రోను చూసి నిర్ణయమా?
ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలను ఏకంగా 44 శాతం వరకూ పెంచారు. ఇదే విధంగా హైదరాబాద్ మెట్రో ఛార్జీలను కూడా సమీక్షించాలని ఎల్ అండ్ టీ భావిస్తోంది. ప్రస్తుతం ఎంత వరకు పెంచాలో నిర్ణయించకపోయినా, ఒక నిర్ణయానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రస్తుతానికి, ఎల్ అండ్ టీ చిన్న స్థాయిలో మొదటి అడుగు వేసింది. హాలీడే సేవర్ కార్డు, మెట్రో కార్డు ఉపయోగించి ప్రయాణించే వారికి ఇస్తున్న 10 శాతం డిస్కౌంట్ను తొలగించింది. అంటే ప్రయాణికులు ఇప్పుడు పూర్తి ఛార్జీనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఛార్జీ పెంపుకు దారి తీసే మొదటి చిహ్నంగా నిపుణులు భావిస్తున్నారు.ఇంతకు ముందు ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. కానీ అప్పట్లో పలు కారణాల వల్ల ప్రభుత్వం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయితే ఇప్పుడు నష్టాల దృష్ట్యా మళ్లీ ప్రభుత్వ ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
ప్రయాణికులపై భారం పెరిగేనా?
ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న సామాన్య ప్రజలకు మెట్రో ఛార్జీలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. మెట్రోను రోజువారీగా ఉపయోగించే ఉద్యోగులు, విద్యార్థులకు ఇది కాస్త భారంగా మారొచ్చు. మరోవైపు మెట్రో రవాణా సౌకర్యం కొనసాగించాలంటే సంస్థకు ఆదాయం కూడా అవసరం.
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగడం ఇప్పుడు కేవలం గాసిప్ కాదు, నిజానికి దగ్గరగా ఉంది. ప్రయాణికులపై భారం పెరగకుండా, సంస్థ నష్టాలను తగ్గించే విధానం ఏముంటుందో చూడాలి. ప్రభుత్వం, సంస్థ మధ్య చర్చలు ఎలా జరిగితే ప్రయాణికులకు నష్టం లేకుండా పరిష్కారం కనుగొనవచ్చు. మరి ఫైనల్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!