పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అత్తాకోడళ్ల సీరియళ్లు ఆసక్తికరంగా ఉంటాయి అన్న దయాకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సూటిగా స్పందించారు.

అత్తాకోడళ్ల అంటే చులకనా? – ఎమ్మెల్యే యశస్విని ఘాటు ప్రశ్న
మీకు అంతగా ఆసక్తి ఉంటే నిజంగానే అత్తాకోడళ్ల సీరియల్ చూపిస్తాం. కానీ మరోసారి అలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడితే, మీకు మర్యాద ఉండదని గమనించండి అని ఆమె బహిరంగంగా హెచ్చరించారు. అత్తాకోడళ్లు అంటే చులకనా? ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయి, ఆ గౌరవం గుర్తుంచుకోవాలి. రాజకీయ విమర్శలు చేయండి కానీ మహిళల గౌరవాన్ని తాకే విధంగా మాట్లాడకండి అని ఆమె మండిపడ్డారు. ఎర్రబెల్లి వయస్సుతో పాటు హుందాతనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆమె సూచించారు. మీ వయస్సుకు తగిన పద్ధతిలో మాట్లాడాలి. విమర్శలు అర్థవంతంగా ఉండాలి, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఎద్దేవా చేయడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అమ్మాయి చిన్నది, సాఫ్టుగా ఉందని అనుకోవద్దని హెచ్చరించారు. పాలకుర్తిని దోచుకుంది, దాచుకుంది బీఆర్ఎస్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలు చేసి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. తాము ఆడోళ్లం మాత్రమే కాదని, ఆడ పులులం అని వ్యాఖ్యానించారు. తాము అత్తాకోడళ్లమే పార్టీని కాపాడుకుంటూ పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నిత్యం అత్తాకోడళ్లు అని మాట్లాడుతున్నారని, అలాంటి వినోదం కావాలంటే అందరి ఇళ్లలో అత్తాకోడళ్ల సమాచారం తీసుకొచ్చి ఇస్తానని ఎర్రబెల్లిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నిత్యం తమను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని, కానీ తనకు ఎంత చెడు చేయాలని చూస్తే దేవుడు తనకు అంత మంచి చేస్తాడని అన్నారు. యశస్విని రెడ్డి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే హనుమాండ్ల ఝాన్సీ కోడలు అని తెలిసిందే. యశస్విని రెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన విజయం సాధించారు.
Read also: Exam : పరీక్షలు జీవితం కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి