దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునేలా ఉంది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన రాబర్ట్ వాద్రా, త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతానని అధికారికంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన హర్యానా భూమి లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే రెండు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరైన వాద్రా, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నేను గాంధీ కుటుంబంలో భాగమన్న కారణంతోనే బీజేపీ నాకు టార్గెట్ అయింది,’అని వాద్రా పేర్కొన్నారు.అయన మాట్లాడుతూ, ‘ప్రజల కోసం పోరాటం చేసే కుటుంబానికి చెందినవాడిని. అందుకే మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా రాజకీయ కుట్ర’అని ఆయన ఆరోపించారు.బీజేపీ ఎంతగా ఇబ్బంది పెడితే, అంతగా బలపడతాం అని ధీమాగా తెలిపారు. ‘తలపోసిన ప్రతి ఒత్తిడినీ ఎదుర్కొంటాం.

ప్రజలు మనతో ఉన్నారంటే ఇంకేం కావాలి?’అంటూ ప్రజలపై తన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని వాద్రా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ‘ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా ఈ చర్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వారిని అణిచివేయడమే అసలు ఉద్దేశం’అన్నారు.‘నేను బీజేపీలో ఉంటే ఇవే పరిస్థితులా ఉండేవి?’అంటూ ప్రశ్నించారు.
తనపై వేధింపుల వెనుక రాజకీయ కక్ష ఉన్నట్లు తేలిపోతోందని వ్యాఖ్యానించారు.ఇక తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇస్తూ, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా తేల్చిచెప్పారు.ఇప్పటికే ప్రజలు తనకు అండగా ఉన్నారని, అది తనకు మరింత ప్రోత్సాహం ఇస్తోందన్నారు.హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ‘2019లోనే నేను ఈ కేసుకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?’అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.ఈడీ విచారణ వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థమైపోతుందని వాద్రా అన్నారు. ‘‘సత్యం ఎప్పటికీ వెలుగులోకి వస్తుంది. న్యాయం జరిగే రోజులు దూరంలో లేవు’’ అంటూ వ్యాఖ్యానించారు.వాద్రా వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. త్వరలోనే ఆయన నుంచి రాజకీయంగా కీలక అడుగులు పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : Mamata Banerjee :ప్రీ ప్లాన్గా వక్ఫ్ ఆందోళనలు: మమతా బెనర్జీ