తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు వేసవి తీవ్రతతో నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకీ గణనీయంగా తగ్గిపోతున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలు ఉన్నా ప్రస్తుతం అందులో కేవలం 39 టీఎంసీలే మిగిలాయి. ఇదే పరిస్థితి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా ఎదురవుతోంది. మొత్తం సామర్థ్యం 312 టీఎంసీలుండగా ప్రస్తుతం 141 టీఎంసులే మిగిలి ఉన్నాయి.
వేసవి ఎఫెక్ట్
వేసవి కాలంలో నీటి వాడకం పెరగడం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వంటి అంశాలు ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి. సాగర్ జలాశయంలో నీటి మట్టం దిగువకు పడిపోతూ ఉండటంతో, త్వరలోనే మరో ఐదు అడుగుల నీరు తగ్గితే హైదరాబాద్కు అత్యవసర పంపింగ్ అవసరం ఏర్పడనుంది. ఇది నగర వాసులకు తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన
ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు, నీటిపారుదల శాఖలు సమర్థవంతమైన నీటి నిర్వహణ పై దృష్టి పెట్టాలి. అలాగే ప్రజలు నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాబోయే రోజుల్లో తాగునీటి కోసం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవచ్చు.