తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ మాటల్లో కోపం, అసహనం ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు.వేల కోట్ల రూపాయల కమీషన్ ఒప్పందం బోల్తా కొట్టిందనే బాధతో కేటీఆర్ మాట్లాడుతున్నట్టు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మేశారని, వాటి మీద ఇప్పుడు ప్రశ్నలు వేయటానికి నైతిక హక్కు లేదని కౌంటర్ ఇచ్చారు.

గతంలో ఎందుకు మౌనం వహించారు?
హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ అనుయాయులకు కట్టబెట్టిందని మహేశ్ ఆరోపించారు. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పెద్దఎత్తున ఆరోపణలు చేయడం వెనుక అసలు ఉద్దేశం భిన్నమని అన్నారు. “గత పది సంవత్సరాల్లో ఈ భూముల గురించి ఎందుకు పోరాడలేదు?” అంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సుప్రీం కోర్టులో పోరాడి 400 ఎకరాలు రికవరీ చేయగలిగిందని తెలిపారు. లేకపోతే ఆ భూములు ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లేవని పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు పర్యావరణం అప్పుడెందుకు గుర్తు రాలేదు?
కోకాపేటలో వేల ఎకరాలను విక్రయించినప్పుడు పర్యావరణం గురించి బీఆర్ఎస్ ఎందుకు ఆలోచించలేదని గౌడ్ ప్రశ్నించారు. అప్పుడే ఎందుకు ప్రశ్నలు లేవనెత్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చే ప్రాజెక్టుల మీద విమర్శలు చేయడం సరికాదన్నారు.400 ఎకరాల భూముల్లో కంపెనీలు ఏర్పాటు అయితే, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని గౌడ్ అన్నారు. ఈ అవకాశాన్ని రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం ప్రజలకు అన్యాయం అవుతుందన్నారు.