ఉత్తరప్రదేశ్లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పేద వృద్ధ దంపతుల జీవితంలో ఆదాయపు పన్ను శాఖ కలకలం రేపింది. వారిద్దరూ రోజు కూలీ చేసుకుంటూ బ్రతుకుతుండగా, ఒక్కసారిగా వారిని లక్ష్మీదేవి కరుణించిందా అన్నంతగా ఐటీ శాఖ నాలుగు కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి నోటీసులు పంపింది.జస్రన పట్టణంలోని ఓ మురికివాడలో నివసించే సబ్రా అనే వృద్ధురాలు తన భర్తతో కలిసి కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. చదువు లేకపోవడంతో ఆమెకు ప్రభుత్వ వ్యవహారాలపై ఎలాంటి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఒక భయానకమైన నోటీసు వచ్చింది.ఆమె పేరుతో రూ. 4.88 కోట్ల ఆదాయం నమోదైందని పేర్కొంటూ, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పన్ను ఎందుకు చెల్లించలేదని వివరణ ఇవ్వాలని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

నోటీసు చూసి షాక్లో పడిన వృద్ధ దంపతులు
నోటీసు విషయాన్ని గ్రహించిన సబ్రా దంపతులు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. తమ జీవితంలో ఎప్పుడూ అంత డబ్బు చూడలేదని, వారికి రూ. 500 అయినా అవసరమైనప్పుడు ఎక్కడికెళ్లాలో తెలియదని వాపోయారు. ఈ నోటీసు తమ జీవితాన్ని పూర్తిగా కలకలం చేసినట్లు వారు మీడియాతో చెప్పారు.
న్యాయవాది అనుమానం… ఆధార్ ఫోర్జరీ కాదా?
ఈ ఘటనపై స్పందించిన న్యాయవాది సంజయ్ జన్, ఇటీవలి కాలంలో ఐటీ శాఖ నుంచి వచ్చిన నోటీసుల్లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇది కూడా అలాంటి పొరపాటే అయ్యి ఉండొచ్చన్నారు. అయితే, ఇది ఫోర్జరీ కూడా కావచ్చని, సబ్రా పేరును ఎవరో ఉపయోగించి నకిలీ ఆధార్, పాన్ కార్డులతో అక్రమంగా డబ్బు లావాదేవీలు చేసిన అవకాశాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఇలాంటి ఘటనలు ప్రభుత్వ వ్యవస్థలో గందరగోళాన్ని చూపిస్తాయి. పేదవారి డేటాను అక్రమంగా వాడి, పెద్ద మొత్తాల్లో మోసాలు చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు అవసరం. ఐటీ శాఖ అధికారులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు జరిపించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.